- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా డయాలసిస్ సెంటర్లు
- చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానాలో ప్రారంభించిన మంత్రులు
యాదాద్రి,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. డయాలసిస్ సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడు ఇచ్చిన వరం లాంటివని పేర్కొన్నారు. ఒక్కో డయాలసిస్ సెంటర్ నిర్వహణకు వందకోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. పేదలకు వైద్యఖర్చులు లేకుండా ముంగిట్లోకే సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు.యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానాలో డయాలసిస్ సెంటర్ను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న చికిత్స చూసి తమిళనాడులో సీఎం స్టాలిన్ కూడా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందున్న మూడు డయాలసిస్ కేంద్రాలను 102 కు పెంచామని స్పష్టం చేశారు.చౌటుప్పల్లో క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.రాబోవు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల దవాఖానా ప్రారంభించ బోతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్టాన్రికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఒకే సంవత్సరంలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ ,సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీబీనగర్ లోఎయిమ్స్ హాస్పిటల్ ఇస్తామంటే ఐదు కోట్ల విలువైన భూమి ఇచ్చామని, అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, హాస్పిటల్స్ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.