ప్రొసీడింగ్ కాపీ అందజేయాలని హైకోర్టు ఆదేశం
అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ స్పీకర్ నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రొసీడింగ్ కాపీని అందజేయాలని హైకోర్టు ఆదేశించగా న్యూస్ పేపర్లు, మీడియా చానెల్స్, యూ ట్యూబ్ ఆధారంగా పిటిషన్ వేశామని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. స్పీకర్ ఎవరిని సస్పెండ్ చేశారో ప్రకటించాలనీ, కానీ ఆవిధంగా జరగలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంలో స్పీకర్ ఎక్కడా నిబంధనలు పాటించలేదనీ, సభా గౌరవానికి భంగం కలిగినప్పుడు మాత్రమే స్పీకర్ సభ్యులను సస్పెండ్ చేయాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై శాసనసభ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలనీ, నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.