- గన్పార్క్ వద్ద మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకని కాంగ్రెస్ నేతల నిరసన
- పిఆర్సీపై ఉద్యోగుల సంబురాలపై జీవన్ రెడ్డి ఆక్షేపణ
తమకు శాసన సభలో మాట్లాడే సమయం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు నగరంలోని అమరవీరుల స్మారకం గన్పార్క్ దగ్గర నిరసనకు దిగారు. సీఎల్పీ నేత భట్టితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో గన్పార్క్ నుంచి అసెంబ్లీకి నడుచుకుంటూ వెళ్లారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్కు లేఖ ఇస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. స్పీకర్ సమయం ఇవ్వకపోవడంతో ఈరోజు స్పీకర్ను కలువనున్నట్లు తెలిపారు. శాసనసభలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వి•డియాతో మాట్లాడుతూ.. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ ఇస్తామని తెలిపారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చలు ముగిశాయని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తమ హక్కులను కాపాడాలని స్పీకర్ను కూడా కోరామన్నారు. సమయం ఇచ్చినా ఇవ్వక పోయినా ప్రజల పక్షాన తమ గొంతును వినిపిస్తున్నామన్నారు.
ప్రజల సమస్యలు వినడానికి అధికార పార్టీ నేతలకు ఓపిక కూడా లేదని శ్రీధర్బాబు
పేర్కొన్నారు. పీఆర్సీని ఎప్పుడు ముగిసిందో అప్పటి నుంచి అమలు చేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలిపారు. అయితే రెండేళ్లు గ్యాప్ వొచ్చినా ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారన్నారు. కొత్త పీఆర్సీ ప్రకటనకు ముందు మధ్యంతర భృతి ఇవ్వడం ఆనవాయితీ అని తెలియజేశారు. ఉద్యోగులకు ప్రస్తుతం రావాల్సిన బెనిఫిట్స్ పదేళ్ల తరువాత ఇస్తామనడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవాలను గ్రహించాలని సూచించారు. గడిచిన 33 నెలల బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
దేశంలో 60 ఏళ్లకు మించి ఉద్యోగుల వయోపరిమితి లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేసీఆర్ ప్రభుత్వం తప్పించుకుంటున్నదని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని క్యాలెండర్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి అమలు చేయబోతున్నామని కేటీఆర్ రెండు నెలల క్రితం చెప్పారని గుర్తుచేశారు. నిరుద్యోగులకు భృతి ఇస్తేనే ప్రభుత్వం దివాలా తీస్తుందా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు.