‘నిర్భయ’ దోషులకు ఉరి 20న
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరో తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు పటియాలా హౌస్ కోర్టు కొత్తగా డెత్ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశాలు జారీ చేశారు. ఉరి శిక్షకు సంబంధించి తీహార్ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 22, ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని గతంలో కోర్టు డెత్ వారెంట్లు ఇచ్చింది. కానీ పవన్ గుప్తా.. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవడంతో అది కూడా ఆగిపోయింది.
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్ వారెంట్లపై స్టే విధించింది పటియాలా హౌస్ కోర్టు. అయితే పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడంతో.. నలుగురు దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలు అయిపోయాయి. దీంతో కోర్టు కొత్త తేదీని ప్రకటించింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలుచేసేందుకు కొత్త తేదీని ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం స్థానిక కోర్టును కోరింది. కేసులో చివరి ద ోషి పవన్కుమార్గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయాయని కోర్టుకు తెలిపింది. దీనిపై గురువారంలోగా స్పందన తెలియజేయాలని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా దోషులను ఆదేశించారు. నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది చేసిన వాదనను జడ్జి తోసిపుచ్చారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో పొందుపరిచిన సహజ న్యాయ సూత్రాలను, అవతలి వ్యక్తి వాదనను కూడా వినాలన్న నిబంధనను విస్మరించకూడదని పేర్కొంటూ.. దోషులకు నోటీసులు జారీచేశారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీ ఖరారు కోసం తీహార్ జైలు అధికారులు కూడా పాటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి నిర్భయ దోషులు ముకేశ్కుమార్ సింగ్ (32), వినయ్శర్మ (26), అక్షయ్కుమార్ సింగ్ (31), పవన్కుమార్గుప్తా (25)లను మార్చి 3న ఉరితీయాల్సి ఉన్నది. అయితే క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదావేయాలని పవన్ కోర్టును ఆశ్రయించడంతో.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మరణదండనపై స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావేంటే నిర్భయ అత్యాచార దోషులకు పటియాల హౌస్కోర్టు తాజాగా డెత్వారెంట్లు జారీచేయడంపై ఆమె తల్లి ఆశాదేవీ హర్షం వ్యక్తం చేశారు. దోషుల ఉరితీతపై గురువారం విచారణ సందర్భంగా కోర్టు వద్దకు చేరుకున్న ఆమె.. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
డెత్వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి డియా మాట్లాడారు. ’నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ఆసన్నమైంది. నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. అదే మాకు పెద్ద విజయం. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. అవకాశం ఉంటే.. వారి చావును నాకు చూడాలని ఉంది’ అని అన్నారు. నిజానికి ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉరితీత మూడోసారి వాయిదాపడింది. తాజాగా ట్రయల్కోర్టు కొత్త డెత్వారెంట్లు జారీచేస్తూ మార్చి 20న ఉరితీయాలని ఆదేశించింది. అయితే దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.