గత కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న ఆకుల నిరంజన్ కుటుంబాన్ని వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యూనిట్ సభ్యులు ఆదుకున్నారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రాంతానికి చెందిన నిరుపేద నిరంజన్ ఓ చికెన్ షాపులో డైలి వర్కర్గా పని చేసేవాడు. అతని భార్య ఆకుల లక్ష్మి కి ఓకే కాన్పులో ముగ్గురు మగ కవలలు జన్మించారు. ఇద్దరు కవలలు జన్మించడమే చాలా అరుదు కాని వీరికి ముగ్గురు కవలలు జన్మించడంతో పిల్లలను ఎంతో కష్ట పడి చదివిస్తున్నారు. ఆకుల నిరంజన్ ఆయన భార్య ఇద్దరు తమ పనులతో వచ్చిన ఆదాయంతో పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు. గత ఏడాది అకస్మాత్తుగా నిరంజన్ అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా కాన్సర్ అని తేలింది. రెక్కాడితే కాని డొక్కాడని నిరంజన్కు ఓ వైపు పూట గడవడమే కష్టం కాగా మరో వైపు పిల్లల ఛదువులు భారంగా మారాయి. వైద్య ఖర్చుల కోసం చాలా ఖర్చు చేశారు. పిల్లలు ముగ్గురు అతి కష్టంగా 9వ తరగతికి చేరారు. ఈ ఏడాది పదో తరగతిలోకి ప్రవేశించారు. హన్మకొండ లోని పాత్ ఫైండర్ ఇంగ్లీషు మీడియం స్కూలులో ప్రస్తుతం వీరు చదువుతున్నారు. ఫీజులు కట్టే స్తోమత లేక చదువు మానేస్తామని పిల్లలు చంద్ర, కృష్ణ, సూర్యలు నిర్ణయించుకున్నారు.
స్కూలు యాజమాన్యం ముగ్గురు పిల్లలలో ఒక్కరికి పూర్తిగా ఫీజు తీసుకోవడం లేదు. ఇద్దరు మాత్రం ప్రతిఏటా ఫీజులు చెల్లించే వారు. కుటుంబ పరిస్థితి బాగా లేక పోవడంతో ఫీజులు చెల్లించడం సాధ్య పడదని ముగ్గురు విద్యార్థులు చదువులు మానేయాలని నిర్ణయించు కున్నారు. కష్టాల్లో ఉన్న వారిని వరంగల్ ఎన్ఆర్ ఐ ఫోరం లండన్ వారు ఆదుకుంటారని విద్యార్థుల తల్లి లక్ష్మికి వరంగల్ వాసులు తెలియ చేయడంతో ఆమె లండన్ ఎన్ఆర్ఐ ఫోరం అద్యక్షుడు శ్రీధర్ నీలను సంప్రదించారు. వారి దీనావస్థను తెల్సుకున్న ఫోరం అద్యక్షుడు శ్రీధర్, ఫౌండర్ కిరణ్ పసునూరి ,సెక్రెటరి భాస్కర్ పిట్టల, వైస్ ప్రెసిడెంట్స్ జయంత్ వద్ది రాజు,రమణ సాదినేని, వంశి మునిగంటి,నాగ ప్రశాంతి సబ్యులు మాడిశెట్టి భాస్కర్ తో పాటు ఇతర ఎన్ఆర్ఐ లు కొందరు కంట్రిబూట్ చేసుకుని రూ.2లక్షల ఆర్థిక సహాయం అంద చేశారు. నిరంజన్ కుటుంబ అవసరాలకు రూ.లక్ష వారి పిల్లల చదువులకు మరో రూ.లక్ష పంపించారు. పిల్లల ఫీజుల వ్యయంతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ కోసం అవసరం అయ్యే ఖర్చుల కోసం ఫాత్ ఫైండర్ పాఠశాల ప్రిన్సిపల్ సరళా అరుణాచలం కు సోమవారం అంద చేసినట్లు వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యూనిట్ అద్యక్షుడు శ్రీధర్ నీల తెలిపారు. మానవత్వం చాటిన లండన్ ఎన్ఆర్ ఐలు వారితో పాటు ఇతర ఎన్ఆర్ఐ లకు పాత్ ఫైండర్ స్కూలు ప్రిన్సిపాల్ సరళా అరుణాచలం అభినందనలు తెలిపారు. తమ కుటుంబాన్ని అదుకుని పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం అందించిన వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ కోర్ కమిటికి విద్యార్థుల తల్లిదండ్రులు నిరంజన్,లక్మ్మి కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక సేవలో ఎన్ఆర్ఐ ఫోరం :
వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం వరంగల్ యూనిట్ సభ్యులు వరంగల్ లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం పంచుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి కారమంగా విధించిన లాక్ డౌన్ పీరియడ్లో మారు మూల ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అంద చేసారు.వరంగల్ లో అంధుల పాఠశాలకు మొదటి అంతస్తులో అదనపు తరగతి కోసం రూ.లక్ష 25 వేల ఆర్థిక సహాయం చేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన టివి కళాకారులకు నిత్యావసర సరుకులు కూడ పంపిణి చేశామని ఫోరం అద్యక్షుడు తెలిపారు. ఒరిస్సా వలస కార్మికులను హైదరాబాద్ నుండి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలకు ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు.