ఇంటర్మీడియట్ ఆర్టస్ గ్రూపుల్లోని సిలబస్లో కొన్ని పాఠ్యాంశాలను తొలగింపు వ్యవహారం గందరగోళంగా తయారైంది. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్ధశాస్త్రం తదితర సబ్జెక్టులలో కొన్ని పాఠ్యాంశాల తొలగింపు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలకు సంబంధించిన పాఠాల తొలగింపుపై రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఇంటర్ బోర్డు వెనక్కి తగ్గింది. ఇంటర్మీడియట్ ఆర్టస్ గ్రూపుల్లోని సబ్జెక్టులలో కొన్ని పాఠ్యాంశాల తొలగింపు కేవలం ప్రతిపాదన మాత్రమేననీ,
దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వివరణ ఇచ్చారు.
జాతీయ నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖులపై పాఠాలు తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థుల నాలుగు నెలల సమయం వృధా అయిందనీ, దీంతో 30 శాతం సిలబస్ కుదించాలని కోరుతూ ఇంటర్ బోర్డు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. హ్యుమానిటీస్ గ్రూపుల్లో పాఠాల తొలగింపు అంశంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిపై నిపుణుల కమిటీ కొన్ని పాఠాల తొలగింపుకు సిఫార్సు చేశాయన్నారు. ఆ సిఫార్సులపై చర్చించి ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ఇక సైన్స్ గ్రూపులకు సంబంధించిన పాఠాలు సీబీఎస్ఈ సూచనలే మేరకే తొలగించినట్లు ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.