చైనాలోని వూహాన్ కొరోనా వైరస్కు పుట్టినిల్లు కావడంతో ఆదేశం నుండి వచ్చే జనాన్ని, వస్తువులను చూసి ప్రపంచమంతా వణికిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడి మరణించిన వారిసంఖ్య తాజా లెక్కల ప్రకారం 42వేలకు పైమాటే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల దేశాలు ఈ మహమ్మారి వైరస్తో అతలాకుతలమవుతున్నాయి. దీని కారణంగా అన్ని దేశాలు అర్థికంగా కృంగిపోతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికానే దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. వైరస్ మాటవినిపించినప్పుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు దాని పరిణామాలను ఇప్పుడాదేశం అనుభవిస్తున్నది. ఈ వైరస్పై తాజాగా ఆదేశ శాస్త్రవేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయమేమంటే పరిణామాలు ఇలానే ఉంటే దేశంలో లక్ష నుండి రెండు లక్షలమంది చనిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ కూడా అదే అభిప్రాయాన్ని తన ప్రకటనల ద్వారా వెల్లడించడం గమనార్హం. ఇక ఇటలీలాంటి దేశ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా మరణాలు సంభవించించాయి. దాన్ని అదుపుచేయడం ఆదేశానికి శక్తిమించిన భారంగా మారింది. మనదేశం మొదట్లో కొద్దిగా జాప్యం చేసినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవడంతో భారీనష్టాన్ని నిలువరించగలిగింది. ఇతర దేశాల నుండి వచ్చే వాయు, జల రోడ్డు మార్గాలన్నిటినీ మూసివేసింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా తమ సరిహద్దుల గుండా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నవారిని కట్టడిచేశాయి. దీంతో బయటినుండి వచ్చే వైరస్ను కట్టడిచేసిన రాష్ట్రాలు ఇప్పుడు రాష్ట్రం లోపలి కరోనాను అరికట్టే పనిలోపడ్డాయి. లాక్డౌన్ అమలులో ఉండే ఏప్రిల్ 14లోగా ఈ కొరోనా కంటికి కనిపించకుండా పోతుందని కేంద్రం భావిస్తుండగా, ఏప్రిల్ ఏడవ తేదీనాటికి లాక్డౌన్ తొలగించే ఆలోచనలో తెలంగాణ రాష్ట్రముంది. ఇక్కడితో ఆ మహమ్మారి పీడా విరగడవుతుందనుకుంటున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మరోసారి అనూహ్య పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ విషయంలో తెలంగాణ ముందస్తుగానే మేల్కొంది. ఇండోనేషియా నుంచి వచ్చిన కొందరు విదేశీయుల కారణంగా కరీంనగర్లో కరోనా కలకలం బయలుదేరిన విషయాన్ని గుర్తించింది. ఢిల్లీ నుండి రామగుండం ద్వారా కరీంనగర్తోపాటు వివిధ ప్రాంతాలు పర్యటించిన ఈ బృందానికి వైద్యపరీక్షలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్ రావడంతో ఒక విధంగా షాక్కు గురైంది. వీరిద్వారా మరెంత మందికి సోకిందోనన్న భయంతో మొత్తం కరీంనగర్నే కట్టడిచేయాల్సి వచ్చింది. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ వద్ద జరిగిన తబ్లిగ్-ఏ-జమాత్ అనే మత సంస్థ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నవారిగా గుర్తించింది. పక్కనున్న ఏపితో సహా దేశవ్యాప్తంగా మరోసారి ఈ సంఘటన ఆందోళనకు కారణమైంది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.
మార్చి 13 నుండి 15 మధ్య ఢిల్లీలో తబ్లిగ్-ఏ-జమాత్ అనే మత సంస్థ అద్వర్యంలో 280 విదేశీయులతో సహా రెండు వేలకుపైన మన దేశానికి చెందిన వారు ప్రార్థనలు నిర్వహించారు. వీరిలో చాలమంది ఆరవై సంవత్సరాలపైబడినవారె. వీరిపై ప్రభుత్వం ఎలాంటి నిఘా పెట్టకపోవడంమే ఈ అనర్ధానికి దారితీసింది. తాజాగా తెలంగాణలో మృతిచెందిన ఆరుగురితోపాటు వివిధ రాష్ట్రాల మరణాలను పరిశీలించినప్పుడు వీరంతా ఢిల్లీ ప్రార్థనల నుండి వచ్చినవారన్న విషయం స్పష్టమైంది. దీంతో కేంద్రం అలర్ట్ అయిది. ఈ ప్రతినిధి బృందం సమావేశాలకు హాజరైన తర్వాత స్వయంగా క్వారంటైన్కు వెళ్ళకుండా ప్రజల మధ్యలో తిరుగుతున్న విషయం ఇప్పుడు దేశంలో మరింత భయాందోళనకు కారణంగా మారింది. ఒక్క హైదరాబాద్ నుండే 603 మంది ప్రతినిధులు హాజరుకాగా, నిజామాబాద్ జిల్లానుండి ఎనభై మంది, అలాగే మిగతా జిల్లాలనుండి ఇద్దరు మొదలు యాభై మంది వరకు ఈ ప్రార్థనలో భాగస్మాములైనట్లు ప్రభుత్వం సమాచారాన్ని సేకరించించింది. వీరి గుర్తించి క్వారంటైన్లో ఉంచేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఇదిలా ఉంటే ప్రారష్ట్ర•నలకు హాజరైనావారంతా తమ స్వస్థలాలకు ఎలా చేరారు. ఎలాంటి ప్రయాణ సాధనాలను వాడారు. వెళ్ళేప్పుడు ఎవరెవరితో కలిసివెళ్ళారు లాంటి సమాచారం రాబట్టేందుకు ప్రభుత్వాలు తలమునకలయ్యాయి.
ఎంతత్వరగా వీరిని గుర్తించి, ఐసోలేషన్ చేయగలితేగాని ప్రబలిపోనున్న విస్ఫోటకాన్ని నివారించలేమని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్రభుత్వ యంత్రాంగం ఎంత కృషిచేసినా వారిని గుర్తించేవరకు చాలాసమయమే పడుతుంది. ఈలోగా నిమిషాల మీద మరింత మందికి ఈవ్యాధి సోకే ప్రమాదం ఉండడంతో ప్రార్థనలకు వెళ్ళివచ్చినవారే స్యయంగా ముందుకువచ్చి సహకరించడం ఒక్కటే మార్గమంటున్నాయి ప్రభుత్వాలు. అలాగే వారిదగ్గరి బంధువులు, స్నేహితులు వారికినచ్చజెప్పి క్వారంటైన్లో ఉండే విథంగా ప్రయత్నించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోగల వ్యాక్సిన్ ఇంతవరకు కనుగొనలేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో ప్రజల సహకారంతోనే దీన్ని నివారించడం సాధ్యపడుతుందంటున్నాయి ప్రభుత్వాలు. మొత్తానికి నిన్న వూహాన్, ఇవ్వాళ నిజాముద్దీన్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి.