- పుదుచ్చేరికి సపంలో తీరం దాటినట్లు వెల్లడి
- తుపాను ధాటికి తమిళనాడు,ఎపిలో భారీ వర్షాలు
తమిళనాడు, పుదుచ్చేరిలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ’నివర్’ తుపాను తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నివర్ తుపాన్ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా మారింది.
తుపాను ధాటికి తమిళనాడులోని చెన్నై సహా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. తమిళనాడు తీరప్రాంతాల్లో పెనుగాలులు, అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు భారీ చెట్లుకూడా నేలకొరిగాయి.అనేక చోట్ల విద్యుత్ స్తంబాలు కూడా పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెన్నైలో చెట్లుకూలి ఒకరు మృతి చెందారు.
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. తమిళనాడులో ముందు జాగ్రత్తగా నాగపట్నం, విల్లుపురం, కడలూరు జిల్లాలతో పాటు మరిన్ని ప్రాంతాల నుంచి 1.45 లక్షల మందిని 1500పైగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తరలించారు. చెన్నై, చెంగల్పేట, కడలూరుతోపాటు పుదుచ్చేరిలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో బుధవారం 16సెంటీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో 10 సెంటీటర్లు కురిసింది. ఇవాళ తమిళనాడులోని 16 జిల్లాల్లో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.