దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు మరోమారు తాజాగా ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు సోమవారం కొత్తగా డెత్వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం వారున్న తీహార్ జైలులోనే వారిని ఉరితీయనున్నారు. కాగా జనవరి 22, ఫిబ్రవరి 1 దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ కేంద్ర •ంశాఖ ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల తీరుపై న్యాయస్థానం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పటియాల కోర్టు దోషులను ఉరితీయాలంటూ తాజాగా డెత్వారెంట్లు జారీచేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో.. ఈసారైనా ఉరిశిక్ష అమలు అవుతుందా లేదా అనేది అసక్తికరంగా మారింది. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శిక్షను అమలు చేయాలన్నారు.
ఉరి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం
నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకునేందుకు ఇప్పటి వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయపరంగా వారికున్న అవకాశాలను ఉపయోగించుకున్న దోషులు మళ్లీ కొత్త నాటకాలకు తెరలేపారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. మరో దోషి అక్షయ్ మరోసారి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నాడు. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. నలుగురు నిందితులకు మార్చి3న ఉదయం 6గంటలకు శిక్షలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ నిరాహార దీక్ష చేపట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో చట్టపరంగా అతడి పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయమూర్తి జైలు సూపరిండెంట్ను ఆదేశించారు. మరోవైపు వినయ్ శర్మ తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేయలేమని వినయ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక మిగిలిన దోషులు కూడా ఉరి వాయిదా పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దోషి అక్షయ్ మరోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు అతడి తరఫున న్యాయవాది తెలిపారు. దోషి పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అతడు కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన తరఫున న్యాయవాది బృందా గ్రోవర్ వాదించడం తనకు ఇష్టం లేదని మరో దోషి ముకేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ కోర్టుకు తెలిపాడు. దీంతో ఆ స్థానంలో అడ్వొకేట్ రవీ ఖాజీని న్యాయస్థానం నియమించింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం మార్చి 3న నలుగురిని ఉరి తీయాలని తీర్పు వెల్లడించింది.