- థర్డ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందే
- పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి
- పోలీస్ బెటాలియన్స్లో కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు
- ఉన్నతస్థాయి సక్షలో అధికారులకు సిఎం జగన్ ఆదేశాలు
అమరావతి,జూలై20 : ఏపీలో మరో వారంపాటు రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కొవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మంగళవారం సక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో అంతా సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించే పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ బెటాలియన్స్లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని సూచించారు. కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. సబ్సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచాలన్నారు. అప్పుడే వారితో పీహెచ్సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారని తెలిపారు. సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్ అందించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 1,80,82,390 వ్యాక్సిన్ డోసులు అందాయన్నారు. కరోనా టీకాల్లో ఇంకా 8,65,500 వరకు డోసులు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,82,49,851 కరోనా డోసులను ఇచ్చినట్టు సీఎం వెల్లడించారు. సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులను ఆదా చేసినట్టు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్ అందించినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమర్ధ నిర్వహణ ద్వారా మాత్రమే టీకాలను ఆదా చేయడం సాధ్యపడిందని తెలిపారు.
45ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. గత మే నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్ డోసులు 35 లక్షలు కాగా.. సుమారు 4,63,590 డోసులు మాత్రమే వినియోగించినట్టు చెప్పారు. ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలన్నారు. వాక్సినేషన్పై వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.