- ఎంఎల్సీ సతీష్కు కోవిడ్ పాజిటివ్..శాసనసభ సమావేశాల కుదింపుకు ఆలోచన
- లాక్డౌన్, కర్ఫ్యూ విధించే యోచనలేదు : రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
రాష్ట్రంలో కొత్తగా 337 కొరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది కోలుకోగా, 1671 మంది మరణించారు. ప్రస్తుతం 2958 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 1226 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 37,079 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 96,50,662కు చేరాయి. కాగా, రాష్ట్రంలో కొరోనా మరణాల రేటు 0.55 శాతం, రికవరీ రేటు 98.52 శాతంగా ఉన్నదని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఎంఎల్సీ సతీష్కు కోవిడ్ పాజిటివ్.. శాసనసభ సమావేశాల కుదింపుకు ఆలోచన
శాసనమండలిలో కొరోనా మహమ్మారి కలకలం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్కు కొరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఉదయం అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన కొరోనా పరీక్షల్లో సతీష్కు పాజిటివ్ నిర్దారణ అయింది. శనివారం ఎమ్మెల్సీ సతీష్.. మండలికి హాజరై బ్జడెట్పై మాట్లాడారు. దీంతో మిగతా మండలి సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సభ్యులందరూ కొరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. మరోవైపు రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకూ ఎఫెక్ట్ తగిలింది. పెరుగుతున్న కేసుల కారణంగా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కుదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బీఏసీ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా మంగళవారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ ప్రకారం ఈనెల 26వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండగా బీఏసీ నిర్ణయం కీలకంగా మారనుంది.
లాక్డౌన్, కర్ఫ్యూ విధించే యోచనలేదు: రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ విధించే యోచనలేది ప్రస్తుతానికి లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడారు. విద్యాసంస్థల్లో కొరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పాజిటివ్ కేసుల పెరుగుదలను బట్టి సెకండ్ వేవ్ అనే భావిస్తున్నామని అన్నారు. కొరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలి.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని శ్రీనివాస రావుసూచించారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని, వ్యాక్సినేషన్ పెరిగితే వైరస్ నియంత్రణలోకి వస్తున్నది అన్నారు. కరోనా నియంత్రణకు గతేడాది ఎలాంటి చర్యలు చేపట్టామో.. ఇప్పుడూ అవే మళ్లీ మొదలయ్యాయని తెలిపారు. ప్రజల అప్రమత్తతోనే కరోనా నియంత్రణ సాధ్యమని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.