- రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు
- రాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తం..కేంద్ర మార్గదర్శకాల మేరకు చర్యలు
- యూకె నుంచి నేరుగా వొచ్చిన వారికి పరీక్షలు
- డియాకు డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
లండన్ నుంచి దేశానికి వొచ్చిన 8 మందికి కొరోనా పాజిటివ్
బ్రిటన్లో కొత్తరకం కొరోనా వైరస్ స్ట్రెయిన్ వొచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్ తెలిపారు. కొత్త రకం వైరస్కు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలు సూచనలు చేసిందన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వొస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తం అయ్యారని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్య విద్య సంచాలకులు డా.రమేశ్ రెడ్డితో కలిసి ఆయన డియాతో మాట్లాడుతూ.. ‘యూకే నుంచి ఏడుగురు ప్రయాణికులు తెలంగాణకు వొచ్చారు. ఈ నెల 15 నుంచి 21 వరకు కేవలం యూకే నుంచే 358 మంది నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 22 వరకు వివిధ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారందరినీ పర్యవేక్షణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి వొచ్చిన వారికి శంషాబాద్ విమానాశ్రయంలోనే కొవిడ్ పరీక్ష చేశాం. అందరికీ నెగెటివ్ వచ్చింది. గత వారం రోజులుగా రాష్ట్రానికి వొచ్చిన వారిని గుర్తించి కొరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో 040-24651119 నంబర్ను ఏర్పాటు చేశాం. గత వారంలో యూకే నుంచి తెలంగాణకు వొచ్చినవారు ఎవరైనా ఈ నంబర్ను సంప్రదించాలి. జిల్లా, రాష్ట్ర పర్యవేక్షణ బృందాలు వారి వద్దకు చేరుకొని వారి ఆరోగ్య స్థితిని
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అవసరమైతే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తాం’ అని తెలిపారు. కొత్త రకం కొరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్లో మార్పులు సహజం. అంతేకాకుండా ఈ కొత్త రకం వైరస్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ సోకలేదు. అయితే ఈ రకం వైరస్ కాస్త వేగంగా వ్యాపిస్తోంది.
ఈస్ట్ యూకేలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి బారినపడి తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటివరకు నమోదు కాలేదని సమాచారం. రాబోయే వారం రోజులు రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సంయుక్తంగా పరిస్థితులను అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశామని శ్రీనివాసరావు వివరించారు. కేవలం యూకే మాత్రమే కాకుండా స్ట్రెయిన్ వ్యాప్తి చెందిన ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వొచ్చే ప్రతి ఒక్కరిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. వారం రోజులుగా ఉష్టోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. త్వరలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వొస్తున్నాయి. పండుగలు పూర్తయ్యే వరకు పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు బయటకు రాకూడదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వివరించారు.
లండన్ నుంచి దేశానికి వొచ్చిన 8 మందికి కొరోనా పాజిటివ్
లండన్ను వొణికిస్తున్న కొత్తరకం స్ట్రెయిన్ భారత్లోనూ ఆందోళన కలిగిస్తోంది. లండన్ నుంచి భారత్ చేరుకున్న 8మందికి కొరోనా పాజిటివ్గా గుర్తించారు. అయితే వీరిలో ఉన్నది పాతదా లేక కొత్తదా అన్నది తేలాల్సి ఉంది. ఈ ఎనిమిది మందిలో ఢిల్లీలో 5 గురికి, కోల్కతాలో ఒకరికి, చెన్నైలో ఇద్దరికి వొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది బ్రిటన్ వైరస్ అవునా కాదా అన్నది వైరాలజిస్టులు తేల్చనున్నారు.
వీరి నమూనాలను వైరాలజీ టెస్టులకు పంపారు. పలు దేశాల్లో కొత్త కొరోనా స్ట్రెయిన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు, ఓడరేవుల్లో ప్రయాణికుల స్క్రీనింగ్ పెంచాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది.