కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట ఉరితాళ్లతో నిరసన
అనంతపురం,జూలై 3 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఉరితాళ్లు వేసుకుని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్, సంతోష్, ఎన్ ఎస్ యు ఐ విశ్వవిద్యాలయాల కన్వీనర్ పులి రాజు మాట్లాడుతూ నిరుద్యోగుల పాలిట వైసిపి రాష్ట్ర ప్రభుత్వం ఉరితాడుగా మారిందని పేర్కొన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులకు బిచ్చం వేసినట్లు కేవలం వందల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం అత్యంత దారుణమన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గొప్పలు పలికి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ముష్టిలాంటి ఒక నోటిఫికేషన్ విడుదల చేసారని మండిపడ్డారు.
సిగ్గులేకుండా జాతర లాంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం వైసీపీ ప్రభుత్వంపనికిమాలిన ఆలోచనే అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆవేదనను గుర్తించాలి తప్ప,వారి జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికే కరువు జిల్లాల్లో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లోలు అని, పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిన వారు అత్యధిక శాతం ఉన్నారని, వాటన్నిటినీ నిర్మూలిస్తాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గొప్పలు పల్లకి నేడు నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం మిగిలింది అన్నారు.
ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే,ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగుల పట్ల తమ వైఖరి మార్చుకోకపోతే సిఎం పర్యటనలు ఎక్కడ జరిగినా అడ్డగిస్తామని, అవసరమైతే ఈ నెలలో చలో సీఎం క్యాంప్ కార్యాలయం కూడా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు రాము,శ్రీనాథ్,విజయ్ రుద్ర, వినయ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఏఐఎస్ఎఫ్ నాయకులు మోహన్, హేమంత్, ఉమా మహేష్, మంజు,వంశీ, అనిల్, ఈశ్వర్, మధు, రాజన్న, షేక్ష, తదితరులు పాల్గొన్నారు.