మరణాల సంఖ్య పెరుగుదలపైనా ఆందోళన
ఏడాది చివరి నాటికి అందరికీ టీకాకు ప్రణాళికలు
కొరోనా కారణంగా మొత్తం 2 వేల 903 మంది రైల్వే ఉద్యోగుల మృతి
కొరోనా తీవ్రత నెమ్మదిస్తున్న వేళ..మళ్లీ దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 39,097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కి చేరింది. ఇందులో 4,08,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 35,087 మంది దేశవ్యాప్తంగా వివిధ హాస్పిటళ్ల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీల సంఖ్య 3,05,03,166కి చేరింది. శుక్రవారం 546 మంది కొరోనాతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,20,016 చేరుకుంది. మరోవైపు…ఇప్పటి వరకు 42.78 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని పేర్కొంది. ఇదిలావుంటే వ్యాక్సినేషన్ పక్రియలో భాగంగా.. ఈ ఏడాది చివరి నాటికి 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ కొరోనా టీకా అందిస్తామని కేంద్రం తెలిపింది. దేశంలో కొరోనా టీకాల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. టీకాల కొరత ఏర్పడిందన్న వ్యాఖ్యలను తోసిపుచ్చింది. జులై 20 నాటికి దేశంలో మొత్తం 34.83 కోట్ల టీకా డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో మరో 135 కోట్ల డోసులు అందుబాటులోకి వొస్తాయన్నారు. దేశీయ టీకా తయారీదారులతో టీకా సేకరణ కోసం ఒప్పందాలు చేసుకోవడంలో ఎలాంటి జాప్యం జరగలేదని పేర్కొన్నారు. టీకా సేకరణ, వాటి సరఫరా, నిర్వహణ ఖర్చుల కోసం ఇప్పటి వరకు కేంద్రం రూ.9,725.15 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. మే 1 నుంచి జూన్ 21వరకు అమలు చేసిన సరళీకృత టీకా సేకరణ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు 4.57 కోట్ల డోసులు కొనుగోలు చేశాయని వెల్లడించారు. అయితే సరళీకృత టీకా సేకరణ విధానం అమలైన సమయంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గిందని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 2,49,648 డోసులు వృథా అయ్యాయని, వైద్య సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించి ఒక్కో వయల్ నుంచి అదనంగా డోసులు సేకరించడం వల్ల 41,11,516 డోసులు అదనంగా అందుబాటులోకి వొచ్చినట్లు తెలిపారు. తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఆంధప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు లక్షల్లో అదనపు డోసులను సేకరించాయని అన్నారు.
కొరోనా కారణంగా మొత్తం 2 వేల 903 మంది రైల్వే ఉద్యోగుల మృతి
మహమ్మారి ప్రభావం ఆరంభమైనప్పటికే లాక్ డౌన్ మొదలుపెట్టినా..కొద్దిపాటి విరామం తర్వాత రైల్వే సర్వీసులు రీ స్టార్ట్ చేయడంతో రైల్వే ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. చాలా మంది కోలుకున్నప్పటికీ..2 వేల 903 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు. ఆ ఉద్యోగులకు చెందాల్సిన బకాయిలను 2వేల 780 మంది బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు వివరించారు. అంతేకాకుండా.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రైల్వే ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆదుకునే కారుణ్య నియామకాలు చేపట్టే విధానం రైల్వేలో ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వెయ్యి 732 బాధిత కుటుంబాలకు కొలువులు కల్పించామని అన్నారు. కొరోనా టీకా పంపిణీ రైల్వే శాఖలో కూడా శరవేగంగా కొనసాగుతుందని రైల్వే డిపార్ట్మెంట్ వెల్లడించింది. 8 లక్షల 63వేల 868 మంది రైల్వే ఉద్యోగులకు తొలిడోసు అందించగా.. 2లక్షల 34వేల 184 మందికి పూర్తి వ్యాక్సినేషన్ అందుకున్నారని పేర్కొంది.
Next Post