– పాక్ అణుబెదరింపులకు లొంగేది లేదు
– ఆపరేషన్ సిందూర్తో మన సత్తా చాటాం
– మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ
భోపాల్, సెప్టెంబర్ 17:నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ రోజు సెప్టెంబర్ 17. ఇది మరో చరిత్రాత్మకమైన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దానికి గుర్తుగా హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నాం అని మోదీ అన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. అణు ముప్పులకు నవ భారతం భయపడదని మోదీ అన్నారు. ఇది నవభారతం. ఎవరికీ భయపడదు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి వారిని మన బలగాలు మట్టుపెట్టాయి. అణుబెదిరింపులకు తలొగ్గదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ అణు బెదిరింపులపై మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ తో భారత్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించిన సంగతి తెలిసిందే. భారత్ ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసిందనే విషయాలను వెల్లడించాడు. పాకిస్థాన్ బుద్ధిని వారు బయటపెట్టారంటూ దీనిని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యలు చేశారు. పుట్టిన రోజున మధ్యప్రదేశ్లో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ.. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్, రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పథకాలను తీసుకొచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




