- సిద్దిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలి
- క్రీడాకారులను కోరిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి సిద్దిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని విభిన్న రంగాల క్రీడాకారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీ గ్రౌండ్లో బుధవారం సాయంత్రం అండర్-14, అండర్-19 ఫుట్ బాల్ క్రీడల కోసం శిక్షణ తరగతులు పొందుతున్న క్రీడాకారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి కబడ్డీ క్రీడా పోటీల కోసం ఏర్పాటు చేసిన లాంగ్ టర్మ్ శిక్షణా శిబిరాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ మేరకు సిద్దిపేట-గజ్వేల్ నియోజకవర్గ జట్ల మధ్య కబడ్డీ పోటీలను కాసేపు వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లాలో కబడ్డీ, ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శివకుమార్, ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి అక్బర్లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.