దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నవారిపై నమోదైన కేసుల పూర్తి వివరాలు ప్రస్తుతానికి తమ వద్ద అందుబాటులో లేవని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్కుమార్రెడ్డి వేసిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న వారిలో ఎంతమందిపై దేశద్రోహం, ఉగ్రవాదం నిరోధక చట్టం కింద నమోదైన కేసులు నమోదు చేశారని, ఇందులో ఎంతమంది విదేశీయులను దేశం వదిలి వెళ్లాలని సూచించారని ఎంపి ఉత్తమ్ కుమార్రెడ్డి మంగళవారం లోక్సభలో అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొని వీసా నిబంధనలను ఉల్లంఘించిన ఐదుగురు విదేశీ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించామని కేంద్రం తెలిపింది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల పరిధిలో ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ పేర్కొన్నారు. అందువల్ల పలు రాష్ట్రాల్లో ఐపిసీ సెక్షన్ 124-ఏ(దేశద్రోహం), ఉగ్రవాద నిరోధక చట్టం కింద నమోదైన కేసుల వివరాలు కేంద్ర వద్ద అందుబాటులో లేవని చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనపై ఆయా ప్రాంతాల్లో అదనపు కేంద్ర బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.