- దశల వారీగా రైల్వే లెవెల్ క్రాసింగ్ల తొలగింపు
- 222 ప్రతిపాదనల్లో 64కే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ..
- కరీంనగర్లో రైల్వే క్రాసింగ్ తొలగింపు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం
- రాష్ట్ర ఎంపి బండి సంజయ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : ‘ఆదర్శ స్టేషన్’ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 27 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించడంతోపాటు ఆయా స్టేషన్లలో అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం గత మూడేళ్లలో తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలు, పనుల పురోగతితోపాటు కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ‘ఆదర్శ స్టేషన్’ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అందులో భాగంగా ప్రయాణీకుల రద్దీ, నిధుల లభ్యత ఆధారంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ కు పనులు మంజూరు చేస్తామని రైల్వే శాఖ మంత్రి తెలిపారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1206 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించగా, ఇప్పటికే 1206 రైల్వే స్టేషన్లను ఆధునీకరించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో (2021-22) మిగిలిన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం 2018-19లో 108.47 కోట్లు, 2019-20 లో 111.55 కోట్లు, 2020-21లో 213.11 కోట్లు, 2021-22లో 224.57 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల రద్దీకి ప్రస్తుతమున్న సౌకర్యాలు సరిపోతాయని రైల్వే మంత్రి అన్నారు. భారతీయ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రయాణీకుల రద్దీ, నిధుల లభ్యత ఆధారంగా కరీంనగర్ స్టేషన్ కు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
దశల వారీగా రైల్వే లెవెల్ క్రాసింగ్ల తొలగింపు తెలంగాణలో గత మూడేళ్లలో 222 రైల్వే క్రాసింగ్ ల తొలగింపుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే వాటిలో 64 ప్రతిపాదనలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు బదలాయింపుకు సమ్మతించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ తొలగింపులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న లెవల్ క్రాసింగ్ ను తొలగించకపోవడానికి కారణాలపై రైల్వే మంత్రి స్పందిస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్లోని 35/5-6 కిలోమీటర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 102.54 కోట్ల ప్రతిపాదనలు పంపగా, రైల్వే శాఖ విధానాల్లో భాగంగా 2 లేన్ ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం తెలిపిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో అనేకసార్లు చర్చలు జరపాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఆ తరువాత గత నెల 11న కేంద్ర ప్రతిపాదనకు అనుగుణంగా అదనపు వ్యయాన్ని భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో రైల్వే శాఖ తదుపరి చర్యలను ప్రారంభించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 7 ఏళ్లలో తొలగించిన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వివరాలతోపాటు రైల్వే ట్రాక్లపై రోడ్ అండర్ బ్రిడ్జి, రోడ్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఖర్చు చేస్తుందా? లేదా? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దేశ వ్యాప్తంగా రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రోడ్ అండర్ బ్రిడ్జ్, డైవర్షన్ రోడ్లు మొదలైన వాటి నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం ద్రుష్టి సారించిందని, అందులో భాగంగా గత 7 ఏళ్లలో 116 రైల్వే లెవెల్ క్రాసింగ్ లను తొలగించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల వాటా బదలాయింపు విషయానికొస్తే…గత మూడేళ్లలో కేంద్రం తెలంగాణలో 222 రైల్వే క్రాసింగ్ ల తొలగింపు ప్రతిపాదనలు పంపిస్తే వాటిలో 64 ప్రతిపాదనలకు మాత్రమే ఆమోదించి నిధుల బదలాయింపు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.