- కేక్ కటి చేసి శుభాకాంక్షలు తెలిపిన మహ్మూద్ అలీ
- రవీంద్రభారతిలో అభిమానుల భారీ చిత్ర కానుక
తెలంగాణ జాగృతి నేతృత్వంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ.. కేక్ కట్ చేసి కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు. కవిత పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు బైకులు, విద్యార్థినిలకు సైకిళ్లను హోంమంత్రి మహమూద్ అలీ అందించారు. అనంతరం తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి సేనతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రజల్లో అవగాహన తీసుకొచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణకే సొంతమైన బతుకమ్మను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత కవితకే దక్కుతుందని ఆయన పొగిడారు. తెలంగాణ ఉద్యమంలో భాగమై.. ఎంతోమంది మహిళలను ఉద్యమంలో ఆమె నడిపించారని హోంమంత్రి అన్నారు.
గతంలో ఎంపీగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమె ప్రజలకు ఎంతో సేవ చేసిందని ఆయన అన్నారు. భగవంతుని ఆశీస్సులతో కవిత మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవీ ప్రసాద్, మర్రి రాజశేఖర్ రెడ్డి, తలసాని సాయి కిరణ్ యాదవ్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ పాల్గొన్నారు. ఇకపోతే రవీంద్రభారతిలో కల్వకుంట్ల కవిత 60 అడుగుల చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 60 అడుగుల భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ యువనేత కవిత వి•ద అభిమానంతో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు శైలేష్ కులకర్ణి కవిత చిత్రాన్ని వేశారు. ఈ చిత్రం వేసేందుకు 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు.
జన్మదినం సందర్భంగా మొక్కనాటిన కవిత
తన జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కవిత ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎంపీ సంతోష్కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ఈ పుట్టినరోజు రోజును ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు. అమ్మ , అన్నయ్య సంతోష్తో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పుట్టినరోజున మొక్కలు నాటడం ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకం అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. రాజకీయంగా మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని అన్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను మంత్రి ఎర్రబెల్లి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.