వికారాబాద్ : బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసి, ఆడపిల్లలను రక్షించి వారి ఆర్థికాభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలకేంద్రంలో 69 మంది లబ్దిదారులకు 69 లక్షల ఎనిమిది వేల నాలుగు రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను వికారాబాద్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్బందులున్నా పేదల సంక్షేమంలో రాజీలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా లేవన్నారు. సామాన్యుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కల్యాణలక్ష్మి, గురుకులాలు, సన్నబియ్యం అన్నం, ఆసరా ఫించన్లు ఇలా ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆడపిల్లల వివాహాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒక్కరికి రూ.1,00,116 అందిస్తుందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకున్నవారికి మాత్రమే కల్యాణలక్ష్మి వర్తిస్తుందని, బాల్యవివహాలు జరగకుండా నిరోధించాలని అన్నారు.
లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి కొరోనా బారిన పడకుండా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ కొండల్ రెడ్డి ఎంపిపి బట్టులలిత రమేష్ , జడ్పీటిసి మధుకర్ ప్రభాకర్ గుప్తా, పిఎసిఎస్ చైర్మెన్ ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎంపిడివో సురేష్ తహశీల్దార్ తులసీరాం, వైస్ ఎంపిపి మోహన్ రెడ్డి సర్పంచులు, ఎంపీటీసీలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.