క్యాబినెట్ సమావేశం ఎలా నిర్వహిస్తారు..!
కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క
సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు.తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 12.8.2020వ తేదీన, ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిందనే వార్తలు రావటం చూసి ప్రజలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందన్నారు.గురువారం భట్టి విక్రమార్క ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారితో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లాడుతోండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి.. ఫుడ్ ప్రాసెసింగ్, లాజస్టిక్ పాలసీ వంటి అంశాల మీద ముఖ్యమంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష జరపటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని విమర్శించారు. అత్యవసర సమయాలు, ప్రక్రుతి వైపరీత్యాలు, యుద్ధాలు, శాంతి భద్రతల సమస్యలు వంటివి తలెత్తినప్పుడు, ముఖ్యమంత్రి అందుబాటులో లేక పోతే.. ఆయన డిజిగ్నేట్ చేసిన సీనియర్ మంత్రి గానీ, ఉప ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగ బద్ధంగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తుంటారు.
కానీ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనప్పుడు..సీఎం తనయుడు కేటీఆర్ ఏ హోదాలో, ఏ నిబంధల ప్రకారం కేబినెట్ భేటీ నిర్వాహించారో చెప్పాలన్నారు. కనీసం కేబినెట్ భేటీకి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా..? లేక ఆయన విదేశీ యాత్రల్లో ఉన్నారా..? అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు .అలాగే, కేబినెట్ మీటింగ్స్, ప్రభుత్వ పాలన అంటే కేసీఆర్ • కేటీఆర్ కుటుంబ వ్యవహారం కాదని మండిపడ్డారు.ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధమైన విషయమని గుర్తు చేశారు.ఒకవేళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అయితే.. కేటీఆర్ తన ఛాంబర్లోనో లేక మరో ప్రాంతంలోనో పెట్టుకోవాలన్నారు .కానీ, ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం కోసం నిర్ధేశించిన హాలులో ఎలా పెడతారు..? దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .