ఎన్నికలప్పుడే రాజకీయ విమర్శలు చేసుకోవాలి
భారతదేశం తలెత్త్తుకునేలా డబుల్ ఇళ్ల నిర్మాణం
ఇళ్ల పథకానికి కేంద్ర సహకారం ఇవ్వాలి
బాగ్లింగపల్లిలో డబుల్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
భారతదేశం తలెత్తుకునేలా పేదలకు రాష్ట్రప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ పథకానికి కేంద్రం తోడ్పాటు అందించాలన్నారు. ఎన్నికలప్పుడు
రాజకీయాలు మాట్లాడుకుందామని, అభివృద్ది కార్యక్రమాల్లో కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేయాల్సి ఉందన్నారు. బాగ్లింగంపల్లిలోని లంబాడీ తండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించుకోవడంతో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇండ్ల పంపిణీ జరగడం సంతోషకరమన్నారు. లంబాడీ తండాలో రూ. 10 కోట్ల 90 లక్షలతో 126 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో ఇంటిపై రూ. 9లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ ఇండ్లను కిరాయికి ఇవ్వడం, అమ్మడం లాంటివి చేయొద్దన్నారు. అలా చేస్తే వాపస్ తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఏ నగరంలో లేని విధంగా.. స్లమ్ ఫ్రీ నగరం కోసం కృషి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
పరిసరాలను వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్దిదారులకు సూచించారు. దేశం గర్వపడే కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. రూ. 18 వేల కోట్లతో రాష్ట్రంలో 2 లక్షల 72 వేల ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కంటోన్మెంట్ ఏరియాలో డిఫెన్స్ భూముల్లో పట్టాలు ఇప్పించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలా ఉన్న ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి సమన్వయంతో పని చేయాలి. రాజకీయాల్లో పోటీ ఉండాలి కానీ, కొట్లాటలు సరికాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. కు ఇంటి సమస్య లేకుండా చేయడం కోసం వీటిని ఇస్తున్నామని గుర్తించాలన్నారు. పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్లో రూ. 50 లక్షలు ధర పలికేలా ఇండ్లను పేదలకు కట్టించి ఇస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. డబుల్ ఇళ్లు దేశంలోనే ప్రథమమని అన్నారు. వీటికి కేంద్రం సహకరించాలన్నారు. 18 వేల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. దేశంలో ఎక్కడ ఇలా ఇల్లు ఇవ్వడం లేదని.. విలువైన ఇళ్ళు ఇవాళ ప్రజల చేతికి అందిస్తున్నామని పేర్కొన్నారు. 40-50 లక్షల విలువ మార్కెట్లో ఉంటుందని…అటువంటి డబుల్ బెడ్ రూమ్ లు లబ్దిదారులకు ఇస్తున్నామని తెలిపారు. ఈ ఇండ్లు కిరాయికి ఇవ్వవద్దు…అమ్మవద్దు …ఒక వేళ అలా చేస్తే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.
హైదరాబాద్ల లక్ష బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తుందని తెలిపారు. మంత్రి కేటీఆర్ శనివారం నగరం పర్యటనలో భాగంగా నారాయణగూడలో మోడ్రన్ మార్కెట్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు దోమలగూడలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయ పనులకు శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్లో కొత్తగా నిర్మించిన స్పోర్టస్ కాంప్లెక్స్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. రూ. 2.66 కోట్లతో నిర్మించిన ఈ బహుళ వినియోగ క్రీడా భవన కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, టేబుల్ టెన్నిస్, జిమ్ సౌకర్యంతో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు వసతులు కల్పించారు. ఇదిలావుంటే నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ముషీరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగడంతో ముషీరాబాద్ ఇండోర్ స్పోర్టస్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం రసాభాసగా మారింది.
ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇటీవల గెలిచిన కార్పోరేటర్ను పిలవలేదన్నారు. మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయగా… బీజేపీ మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. కేటీఆర్ కాన్వాయ్కి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తీసుకుని వెళ్లిపోయారు.