- మా నీటి వాటాను అడుగుతున్నాం
- కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కావాల్సిందే
- కేంద్రంతో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యక్తిగత పంచాయతీ లేదు
- కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలకు మంత్రి హరీష్రావు వివరణ
తెలంగాణ ప్రభుత్వం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని…రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నీటి వాటాను అడుగుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీష్రావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ… కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదని, సమస్యల్లా తమ నీళ్లు తమకు దక్కాలన్నదేనని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదన్నారు. అక్రమంగా ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్కు కృష్ణా జలాలను తీసుకెళ్తుందనీ, కృష్ణా జలాల్లో తమకు న్యాయమైన వాటా రావడం లేదనీ, కృష్ణా బేసిన్లో తమ నీటి వాటా తమకు కావాలంటే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి.
సుప్రీమ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నాం. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి తక్షణమే ట్రైబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జరిగిన జాప్యానికి సీఎం కేసీఆర్ కారణమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్రావు వివరణ ఇచ్చారు. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్లో సెక్షన్ 3 కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏదైనా ఒక రాష్ట్రం ఫిర్యాదు చేసినప్పుడు సంవత్సరంలోగా పరిష్కరించాలి. లేదా ట్రైబ్యునల్కు రిఫర్ చేయాలని చట్టంలో ఉంది. ఇది భారతదేశంలో అమలవుతున్న చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఏడేండ్లుగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ, కేంద్ర మంత్రి షెకావత్ వ్యక్తిగతంగా తీసుకున్నట్లు ఉంది. రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే సెక్షన్ 3 కింద ఫిర్యాదు చేశాం. అంటే 14 జులై 2014న కేంద్రానికి, అప్పటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశాం. జల వివాదాలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లి అప్పటి కేంద్ర జలనవరుల శాఖ మంత్రి ఉమాభారతి వద్ద ఫిర్యాదు చేశాం. ఇది సీఎం కేసీఆర్కు నీళ్ల మీద, రాష్ట్ర మీద ఉన్న తపన.
వారి కృషికి, పట్టుదలకు ఒక నిదర్శనం. దీన్ని షెకావత్ అర్థం చేసుకోవాలన్నారు. తాము జులై 14న ఫిర్యాదు చేస్తే.. ఎంత పట్టుదలగా తాము ప్రయత్నం చేశామో అర్థం చేసుకోవాలి. 14 జులై, 2014 నుంచి నవంబర్, 2021 వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలో తాత్సరం జరిగింది నిజమే కదా? ఈ ఏడు సంవత్సరాల్లో మీరు నిర్ణయం తీసుకొని ఉంటే మాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది. ఏడు సంవత్సరాల నుంచి కేంద్రంలో పెండింగ్లో ఉందని చెప్పాం. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్పాం. సీఎం కేసీఆర్ ఆదేశాలకు తాను అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రం జలవనరుల శాఖకు ఫిర్యాదు చేశాం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్కు రిఫర్ చేయాలని న్యాయశాఖ చెప్పినప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. అందుకే ఏడాది కాలం పాటు వేచి చూసినా తర్వాత సుప్రీమ్ కోర్టుకు వెళ్లాం. 13 నెలల తర్వాత ఆగస్టు 2015లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పని పరిస్థితుల్లో సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. న్యాయమైన నీటి వాటా కోసమే ఫిర్యాదు చేశామన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోవాలనే కోర్టుకు వెళ్లాం. కోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ మీరు నిర్ణయం తీసుకుంటే నష్టం లేదు కదా? అయినప్పటికీ మీ మీద గౌరవం ఉంచి సీఎం కేసీఆర్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికైనా నిర్ణయం తీసుకుని ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయండి. కేసు మొన్ననే విత్ డ్రా అయింది కదా.. నేనేం చేస్తాను అని షెకావత్ అనడం సరికాదు. ఏడేండ్లుగా నిర్ణయం తీసుకోలేదు అన్నదే మా బాధ. కేసు ఉండగా కూడా నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదు. ఇప్పటికైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలి. కృష్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా కావాలన్నదే మా ఆవేదన. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే మా తపన. ఇది నాలుగు నెలల నుంచి కాదు ఏడేండ్ల నుంచి పెండింగ్లో ఉందని హరీష్రావు స్పష్టం చేశారు. తమ ఆవేదన అంతా కృష్ణా జలాల్లో తమ వాటా తమకు కావాలనేదే అన్నారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, బక్కి వెంకటయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.