- ఏండ్ల తరబడి మీ దిగులు, రంది దూరమైంది
- ఇక నుంచి సర్వ హక్కులు మీకే ఉండేలా చర్యలు
- 472 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టా ధృవీకరణ పత్రాలు అందజేత
- మీరంతా ఒక్కమాటపైకొచ్చి ఆశీర్వదించాలని కోరిన మంత్రి హరీష్రావు
యేండ్ల నుంచి మీకున్న రంది దూరం చేశాం. శాశ్వతంగా మీ పేరిట ఇంటి పట్టా చేశాం. మునిసిపాలిటీలో సైతం ఆన్లైనులో మీ ఇల్లు పేరిట అసెస్మెంట్ ఎంట్రీ చేశాం. ఇవాల్లీ నుంచి సర్వ హక్కులు మీకే ఉండేలా భద్రత కల్పించి పట్టా ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్లో బుధవారం పొన్నాల శివారు, నర్సాపూర్-గుండ్ల చెరువు, హరీష్నగర్, వికాస్ హైస్కూలు సమీప ప్రాంతాల్లోని కాలనీకి చెందిన 472 మందికి నివాస యోగ్యమైన ఇండ్ల ధృవీకరణ పట్టా పత్రాలను ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్తో కలిసి మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చట్టరీత్యా మీరు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నారనీ, అది తప్పంటూ.. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలం కొనుగోలు చేసి ఆ స్థలంలో మధ్యతరగతి జీవనం గడుపుతూ.. కట్టుకున్న మీరు గరీబోల్లేననీ, మీలాంటి వారి పర్మనెంట్-శాశ్వత పరిష్కారం దిశగా పట్టాలు ఇస్తే మీకు మేలు జరుగుతుందని ఈ పక్రియ చేపట్టినట్లు తెలిపారు.
ఏళ్ల కింద స్థలం కొని ఇండ్లు కట్టుకుని సంబంధిత ఇల్లు పట్టా కాగితం లేక, దిగులు చెందుతున్న మీకు ఇవాళ్లీ నుంచి మీరు కట్టుకున్న ఇండ్లపై సర్వ హక్కులు మీకే ఉండేలా భద్రత కల్పించామనీ, ఇక నుంచి రంది పడొద్దని పట్టా ధృవీకరణ పత్రాలు అందించామని పేర్కొన్నారు. మీ కష్టసుఖాల్లో.. ఉండే వ్యక్తిని మీకు తోడుగా పంపిస్తాననీ.. మీ మంచి మనస్సుతో మీరంతా ఒక్కమాటపైకొచ్చి ఆ మంచి మనిషిని ఆశీర్వదించాలని సిద్ధిపేట మునిసిపల్ ఎన్నికలను ఉద్దేశించి మంత్రి హరీష్రావు కోరారు. అంతకుముందు కొరోనాతో జాగ్రత్తగ ఉండాలని, 45 యేండ్లు దాటినా ప్రతీ ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ టీకా తీసుకోవాలని ప్రజలను కోరారు. రోజూ ఆవిరి పట్టాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. సిద్దిపేటలో చెత్తను వేరుచేసి మునిసిపల్ వాహనానికి ఇవ్వాలని, చెత్తను బయట పడేయొద్దని కోరారు.
గల్లీతో పాటు సిద్ధిపేట మంచిగా ఉండాలని, ఆకుపచ్చ, ఆరోగ్య సిద్ధిపేట నిర్మాణం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సర్కారు దవాఖానలో డయాగ్నోస్టిక్ కేంద్రంలో 56 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని, కేసీఆర్ కిట్ ఇస్తున్నట్లు, అన్నం పెట్టి, తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మంది డాక్టర్లు ఉన్నారని, సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేశామని వినియోగించుకోవాలని సూచించారు. కోమటి చెరువు వద్ద మూడు రోజుల పాటు లేక్ ఫెస్టివల్ ఏర్పాట్లు చేసినట్లు, మీ వీలును బట్టి రావాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, తహశీల్దార్ విజయ్, డిప్యూటీ తహశీల్దార్ రాజేశం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.