మల్లన్న సాగర్ కాలువ భూ సేకరణ పనులు సూపర్ స్పీడుతో చేయాలి
దుబ్బాక రివ్యూలో అధికారులకు మంత్రి హరీష్రావు ఆదేశంయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ కొమురవెళ్లి మల్లన్న జలాశయ డిస్ట్రిబ్యూటరీ కాలువ భూ సేకరణ పనులు సూపర్ స్పీడ్లో పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. దుబ్బాక నియోజకవర్గ కేంద్రమైన ఏంపీడీఓ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ అభివృద్ధి పనుల ప్రగతి నిర్మాణ పనులతో పాటు మల్లన్న సాగర్ కాల్వలు, పిల్ల కాల్వల భూసేకరణపై మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇది చరిత్రలో నిలిచిపోయే పని..చిరకాలం గుర్తుండి పోయేలా ప్రజలకు గొప్ప సేవ చేస్తున్నాం..! కాల్వల భూసేకరణ, కాల్వల నిర్మాణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది.. అని దిశా నిర్దేశం చేశారు.
ప్రజా ప్రతినిధులుగా.. ప్రజలకు గొప్ప సేవే చేసే అవకాశం వచ్చిందని భావించి, దీనిని ఓ అదృష్టంగా భావిస్తూ..చరిత్రలో నిలిచిపోయేలా పనులు వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు అధికారులకు, ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు. మైనర్ ఇరిగేషన్లో భాగంగా ప్రతి పల్లెలోని చెరువులు, కుంటలు, ఒర్రెలు, వాగులు, వంకలన్నీ నింపితే.. ఆ పల్లె ప్రజలకు ఎంతో గొప్ప సేవ చేసినవారమవుతామని, ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ప్రధానంగా కాలువలు, పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మైనర్ కెనాల్స్ కోసం అవసరమైన భూ సేకరణ చేపట్టాల్సి ఉన్నందున స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సహకరించాలని, ఈ భూ సేకరణ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భూ సేకరణ పనులు పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశం. ఈ సమీక్షలో మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ఏంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.