- నయా పైసా ఖర్చు లేకుండా ఇండ్లు కట్టించాం
- కిరాయికి ఇచ్చినా, అమ్మినా స్వాధీనం చేసుకుంటాం
- కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్న ఏకైక ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నయా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అన్ని అధునాతన వసతులతో కట్టించారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నయాపైసా ఖర్చు లేకుండా కట్టించిన ఇండ్లను ఎవరైనా కిరాయికి ఇచ్చినా, అమ్మినా చర్యలు తీసుకోవడంతో పాటు ఇండ్లను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందనీ మంత్రి హరీష్రావు హెచ్చరించారు.
గురువారం సిద్ధిపేటలోని కేసీఆర్ నగర్(నర్సాపూర్)లో 216 మంది లబ్దిదారుల గృహ ప్రవేశాలు పండుగ వాతావరణంలో మంత్రి హరీష్రావు సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…కట్టిన ఇల్ల్లు.. పెట్టిన పొయ్యితో.. సంప్రదాయబద్ధంగా కొత్త బట్టలు పెట్టి కొత్తిండ్లకు మిమ్మల్ని తోలిస్తున్నాం.! పేదల ముఖంలో ఆనందపు వెలుగులు చూడటమే సీఏం కేసీఆర్ సర్కార్ లక్ష్యం.! దేశంలో ఎక్కడా లేని విధంగా, ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. గూడు లేని పేదలకే ఇండ్లు దక్కలన్న సీఎం ఆకాంక్ష నెరవేరిందని మంత్రి అన్నారు.
వరుస క్రమంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తూ మంత్రి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్తింట్లకు వొచ్చిండ్రు సంతోషమేనా అంటూ.. ఆప్యాయంగా పలకరించారు. పలుచోట్ల మంత్రికి మిఠాయిలు తినిపిస్తూ వారి సంబురాన్ని వ్యక్తం చేశారు. పలువురు ముస్లిం మైనారిటీలు దట్టీ కట్టి, శాలువాతో సత్కారం చేసి మంత్రిని ఘనంగా స్వాగతించారు. 33 బ్లాకు నెంబరులోని 2వ నెంబరు ఇంట్లో కనకవ్వ-ఉప్పలయ్య దంపతులు సారూ మీరు సతీసమేతంగా ఇచ్చిన కొత్త బట్టలు కుట్టించుకుని..ఇయ్యాల కొత్తింట్లకు వొచ్చినం.. సారూ అంటూ వారి సంబురాన్ని మంత్రితో పంచుకున్నారు.