- ఐటిఆఐఆర్,కోచ్ ఫ్యాక్టరీ ఏం చేశారు
- సెస్ల పేరుతో పెట్రోల్ రేట్లు పెంచుతూ పోతే ఎలా
- బిజెపిపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు
ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సెస్ల పేరుతో పెట్రోల్ రేట్లు పెంచుతూ పోతుందన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం బృందావన్ గార్డెన్లో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్ ధరను యాదించుకో అని ఓటర్కు చెప్పాలన్నారు.
ప్రపంచంలో పెట్రోల్ రేటు తగ్గితే భారత దేశంలో ఎందుకు పెంచుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం అని ప్రశ్నించారు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అని హరీశ్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతు బంధు, రైతు బీమా లేదు. కల్యాణ లక్ష్మీ లేదు. ఇంటింటికి నీళ్లు లేవు అన్నారు. రైతులకి ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర పోలీస్ శాఖ మన దగ్గరకు వచ్చి మన పోలీస్ శాఖ తీసుకున్న షీ టీమ్స్ బాగున్నాయని పొగిడిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని అన్నారు. ఈ లెక్కన ఇప్పటికే 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి వచ్చాయా? అని ప్రశ్నించారు.
ఉద్యోగాలు రావడం అటుంచి ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టే పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం అంటే డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగాన్ని కాల రాయడమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ సంస్థలు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్పరం చేయడమే వాళ్ళ లక్ష్యం. దీంతో ఎంతో మంది రోడ్డున పడుతారన్నారు. 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ రామచందర్ రావు అని హరీశ్ అన్నారు.
ఆయనకు ఎమ్మెల్సీ అంటే ఇష్టం లేక ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి విద్యావేత్త మన వాణీదేవి. ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించిన గొప్ప వ్యక్తి. మాజీ ప్రధానమంత్రి కూతురు అయినప్పటికీ ఆమె ప్రొపెసర్గా కరస్పాండెంట్గా సేవలు అందించారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. ఒక్కటంటే ఒక్క మంచి పని చెప్పండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా. ఐటీఐఆర్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క ఎన్నికలో గెలిచి ఎగిరి ఎగిరి పడుతున్నారని పేర్కొన్నారు.