- పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
- పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపిలు
- వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్
- దిల్లీ విజయ్ చౌక్ వద్ద రాహుల్ ఆధ్వర్యంలో ధర్నా
- మధ్యప్రదేశ్, చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు
న్యూ దిల్లీ, మార్చి 31 : ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పెంచిన ధరలను పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపు..సామాన్యుడికి పెను భారంగా మారిందని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి దిల్లీలోని విజయ్ చౌక్లో ఆయన ధర్నా నిర్వహించారు. అంతకుముందు పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రో ధరలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారినా చలించడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇంధన ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో పేదవారి నుంచి ప్రభుత్వం డబ్బులు దోచుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తోంది. ఐదు రాష్టాల్ర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడదే జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసిస్తూ.. మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్నాథ్ ఆధ్వర్యంలో మహిళలు ధర్నాలకు దిగారు. గ్యాస్ సిలిండర్లకు దండలు వేస్తూ నిరసనలు చేపట్టారు. చెన్నైలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలను తగ్గించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
