హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్ఎన్ఏ టీకా తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి కేటీఆర్ను సీఎన్బీసీ-టీవీ18 ఎడిటర్ షరీన్ భాన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆ ఎడిటర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ..తెలంగాణ సర్కార్ అనునిత్యం మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు ఆకర్షిస్తుందన్నారు. దీని వల్ల ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. కొరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచ వ్యాప్తంగా కనిపించాయని, కొరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే, లైఫ్ సైన్సెస్కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు.
మూడో వంతు టీకా తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. రాష్ట్రంలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు. కొరోనా ఒక్కటే కాదు, ఇతర మహమ్మారులు ఏవి వొచ్చినా వాటిని ఎదుర్కునే రీతిలో టీకాలు కావాలన్న నిర్ణయం చేశామన్నారు. ఎంఆర్ఎన్ఏ టీకాలు ఉత్పత్తి అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, దాని గురించి వాళ్లు కూడా ఆసక్తి ప్రదర్శించారని, త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ టీకా హబ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబోతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.