‘ సీఏఏ,ఎన్ఆర్ సీలను వ్యతిరేకిస్తున్నట్టు మొదట ప్రకటించిన థాకరే వాటిని ఆమోదించడంతో కూటమి పక్షాల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్,ఎన్సీపీ నాయకులు ఆరోపించారు.’

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) కాంగ్రెస్, ఎన్నీపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్ పిఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్ ఆర్ సీ)లను వ్యతిరేకిస్తున్నాయి. ఇవి మేలో ప్రారంభం కానున్నాయి. సీఏఏకి ఇవి ముసుగులని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఉద్దవ్ థాకరే కూడా గతంలో ఈ చట్టం వల్ల మహారాష్ట్రలో ఏ పౌరునికీ హాని జరగదని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఇందుకు కారణం ఏమంటే, ఏడాది క్రితం మానవ హక్కుల ఉద్యమకారులు ఎల్గార్ పరిషత్ కేసులో ఇరుక్కున్నారు. వారిపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ ఐఏ) దర్యాప్తుకు చర్యలు చేపట్టింది. దేశ ద్రోహ నేరం కింద వారిపై కేసు నమోదు అయింది. ఎన్ ఐఏ ఈ కేసు చేపట్టడానికి ముందు నిందితులకు బెయిల్ వస్తుందన్న ఊహాగానాలు వ్యాపించాయి. ఈ యత్నాలను శివసేన పత్రిక సామ్నా తీవ్రంగా విమర్శించింది. కొద్ది రోజుల తర్వాత ఎటువంటి అడ్డు చెప్పకుండా ఎన్ ఐఏకి అప్పగించింది. రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అభ్యంతరాలను తోసిపుచ్చారు.తన అభ్యంతరాలను తోసిరాజన్నారని దేశముఖ్ తెలిపారు.
గత వారం థాకరే సీనియ్ అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద ఇంటింటికీ తిరిగి జనగణన కార్యక్రమానికి సన్నాహాల గురించి చర్చించారు. సీఏఏ,ఎన్ ఆర్ సీల కు ముసుగే ఎన్ పిఆర్. వీటిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. గత శనివారం ముంబాయిలో పెద్ద ర్యాలీ జరిగింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబూ అజ్మీ. మాట్లాడుతూ ఎన్ పిఆర్ కింద జనగణన కోసం వచ్చే వారిని తమ గుమ్మంలోకి రానివ్వవద్దని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
సీఏఏ,ఎన్ఆర్ సీలను వ్యతిరేకిస్తున్నట్టు మొదట ప్రకటించిన థాకరే వాటిని ఆమోదించడంతో కూటమి పక్షాల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్,ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేరుగా థాకరేతో అనగా, బీజేపీ ప్రయత్నాలు ఫలించవని థాకరే అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి ఫలించకపో వడంతో బీజేపీ కార్యకర్తలు నిరాశానిస్పృహలతో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డారు.ఆయన ఆశలపై మహా వికాస్ ఆగాది నీళ్లు పోసింది. అందువల్ల కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఢోకాలేదు. తమ కూటమిని సంఘటితం పర్చే విషయమై వారు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.
కూటమి భాగస్వామ్య పక్షాలు వేర్వేరు భావజాలాల గల పార్టీలు. అందు వల్ల కూటమిలో సర్దుకుని పోవడం కష్టమే. కాంగ్రెస్, ఎన్సీపీలు పదేళ్ళ పాటు ఒకే కూటమిగా ఏర్పడి పరిపాలన సాగించడం వల్ల ఆ రెండూ కలిసి ఉండేందుకు వీలుంది. కానీ, శివసేనతో సర్దుకుని పోవడం కష్టమే. పరస్పర ప్రయోజనం కోసం ఈ పార్టీలు ఒకే కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, బీజేపీని అధికారంలోకి రాకుండా చూడటానికి ఈ మూడు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. కనీసం రెండేళ్ళ పాటైనా కొనసాగేందుకు అవి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
తన మద్దతుదారుల్లో అత్యధికులు మోడీ అభిమానులనీ, జాతీయభావాలు కలవారన్న సంగతి ఉద్ధవ్ థాకరేకి తెలుసు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య గొడవలేమైనా ఉంటే ఎప్పటికప్పుడు సర్దుకుని పోవాలని నిర్ణయించాయి. అయితే, ఇది శాశ్వత పరిష్కారం కాదు. తాత్కాలిక ఏర్పాటు మాత్రమే., ఎన్ పిఆర్ పట్ల కూటమి పార్టీల మద్య తీవ్ర విభేదాలు ఉన్నాయి.ఇవి బయటపడకుండా సర్దుకుని పోతున్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు పుట్టుకువస్తున్నాయి. జనగణన విషయంలో ఉద్ధవ్ థాకరే పిల్లి మొగ్గవేయడం కాంగ్రెస్, ఎన్సీపీలకు ఆగ్రహాన్ని కలిగించింది. ఆయన వైఖరి మారిందేమోనన్న అనుమానాలు వ్యక్తం కావడం కాంగ్రెస్,ఎన్సీపీలు ఆగ్రహానికి కారణం. సీఏఏకి అనుకూలంగా లోక సభలో శివసేన ఓటు వేసింది. కాంగ్రెస్ , ఎన్సీపీలు కన్నెర్ర చేయడంతో రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇలా సమయానుకూలంగా శివసేన వైఖరులు మార్చుకోవడం కాంగ్రెస్ దాయాది పార్టీలకు నచ్చలేదు.