- వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లులను ఉపసంహరించాల్సిందే
- ఇందిరా పార్క్ వద్ద ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో ధర్నాా
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక హక్కుల నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్నది దేశభక్తుల ఉద్యమమనీ, ఈ ఉద్యమం వెనక పాకిస్తాన్, చైనా, ఉగ్రవాదులు, నక్సలైట్లు వంటి శక్తులేవీ లేదనీ, దీనిపై బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించాలనీ, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు పోరాట కమిటీ (ఏఐకేఎస్సీసీ) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే దేశద్రోహులని పేర్కొన్నారు. ఇది రైతుల్లేని ఉద్యమం అని బీజేపీ నేతలు అంటున్నారనీ, బీజేపీ నాయకులు కంప్యూటర్లకు పుట్టి ఉంటారని ఎద్దేవా చేశారు. గతంలో నిజాంకు ఎలా బానిసల్లా ఉండేవారో ఈ చట్టాలు అమలైతే అంబానీ, ఆదానీలకు రైతులు బానిసల్లా మారాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ చట్టాలను వ్యతిరేకించడంలో కేసీఆర్, జగన్ మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ పులి ఢిల్లీలో పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిర్బంధ చట్టాలు అమలైనప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైనట్లేనని చెప్పారు. •సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వినాశకర చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రైతు ప్రయోజనకర చట్టాలను తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం ఆటంకమని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో చర్చ జరగలేదనీ, సెలక్ట్ కమిటీకి ఇవ్వాలని కోరితే అదీ చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేసి రైతులు కోరుతున్న అంశాల ప్రాతిపదికన కొత్త చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందనీ, ఇందుకోసం దేశావ్యాప్త మద్దతు కూడగడతామని చెప్పారు.
బీజేపీ నాయకులు దేశభక్తులైతే ఈ చట్టాలను రైతు అనుకూల చట్టాలను చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం జయప్రదమైతేనే దేశానికి, ప్రజాస్వామ్యానికి రక్ష అని అన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ గుత్త పెట్టుబడిదారి సంస్థలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. నకిలీ మందులు, విత్తనాలు అమ్మే వారిని అరికట్టాలనీ, బ్యాంకుల్లో సులభంగా సేవలు, మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేయాలని రైతులు భావిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం చట్టాలు చేయకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూల చట్టాలు తేవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ నోరు ఢిల్లీకి వెళ్లగానే ఎందుకు మూగపోయిందని ప్రశ్నించారు. ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, సాదినేని వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ నేతలు గోవర్ధన్, సంధ్య, సామాజిక విశ్లేషకురాలు సజయ పాల్గొన్నారు.