ఫలితం ముందే తెలిసినప్పట్టికీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్.సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల గడువు గడిచిన శుక్రవారంతో ముగిసింది. 16న నామినేషన్లను పరిశీలించారు. బుధవారం సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు.
కాగా పోటీ అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఇరువురి ఏకగ్రీవ ఎన్నికపట్ల పలువురు రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే నుంచి త్రిచి శివ, ఎన్ఆర్ ఎలంగో, అంతియూర్ సెల్వరాజ్ ఎన్నికవగా ఏఐఏడీఎంకే నుంచి కేపీ మునుస్వామి, ఎం.తంబిదురై ఎన్నికయ్యారు. తమిళ మనీలా కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.