కాంగ్రెస్ ఉగ్రవాదులతో కలసి కుట్రపూరిత రాజకీయం
కర్నాటక ప్రచారంలో విరుచుకు పడ్డ ప్రధాని మోదీ
బెంగళూరు, మే 5 : ది కేరళ ఫైల్స్ మూవీపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. కేరలో జరుగుతున్న ఉగ్రవాద కుట్ర సత్యాన్ని ఈ సినిమాలో బయటపెట్టారని మోదీ తెలిపారు. మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బళ్లారిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉగ్రవాదులతో కలిసి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతుందని ఆరోపించారు. వారికి అండగా ఉంటూ తెరవెనుక రాజకీయలు చేస్తుందని మండిపడ్దారు. తీవ్రవాదం, ఉగ్రవాద ధోరణులపై తీసిన ది కేరళ ఫైల్స్ సినిమాను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని మోదీ అన్నారు. వోటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని కాపాడతుందని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను కాపాడగలదా అని ప్రశ్నించారు. కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు భద్రతా వ్యవస్థ, శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. ఉగ్రవాదంపై బీజేపీ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం తప్పుడు కథనాలు, సర్వేలు చేస్తుందని, రాష్ట్రంలోని వోటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా బుజ్జగింపుల గురించి, నిషేధాల గురించి ఉందని ఎద్దేవా చేశారు. యడ్యూరప్ప, బొమ్మై నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లు మాత్రమే ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని మోదీ తెలిపారు. మరోసారి బీజేపీకి కన్నడ ప్రజలు అధికారం ఇవ్వాలని, కర్నాటకను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా మోదీ హా ఇచ్చారు.