‘‘కరెంట్ వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు కరెంట్ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత కెసిఆర్దే. ఎవరిని అడిగినా ఈ విషయంలో మొహమాటం లేకుండా చెబుతారు.’’
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనురించాల్సిన వ్యూహాలను బయట పెట్టకున్నా..కెసిఆర్ తన అనుచరులతో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ఓ వైపు బిఆర్ఎస్ విస్తరణతో పాటు..మరోవైపు అసెంబ్లీ ఎన్నికల పోరులో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలోపార్టీ శ్రేణులను ఆత్మీయ సమ్మేళనాలతో బిజీగా ఉంచుతున్నారు. ఎండలను లెక్క చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలతో రోజూ ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ,అభివృద్ది పథకాలను మరోమారు హైలెట్ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇదే క్రమంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలు..హాల వైఫల్యం పైనా ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నిక ల్లోనూ కెసిఆర్ పాపులర్ పథకాలు మరోమారు ప్రచారాంశం కానున్నాయి.మోదీ•పై రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు రానున్నాయి. ప్రధానంగా 24 గంటలు కరంట్ అందిస్తున్న తీరును ఆయన బాగా ముందుకు తేనున్నారు. ఎండాకాలంలో ఊరూరా కరెంట్ వస్తున్న విషయాన్ని బాగా ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే ట్రాన్స్కో కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా విద్యుత్ సరఫరాలో ముందున్నది. ప్రధానంగా ఈ నాలుగేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమించాం. అది కొని ఇస్తున్నారా..లేక మరో రకంగా ఇస్తున్నారా అన్నది అప్రస్తుతం. ఎందుకంటే కరెంట్ వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు కరెంట్ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత కెసిఆర్దే. ఎవరిని అడిగినా ఈ విషయంలో మొహమాటం లేకుండా చెబుతారు.
తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత 9 ఏళ్ల కాలం పరిశీలిస్తే సిఎం కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారనే చెప్పాలి. ఇలాంటి నిర్ణయా లతో తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు పడ్డాయి. ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టంగా పేర్కొనాలి. పాలనా వికేంద్రీకరణలో ఇదో మైలురాయి. స్వాతంత్య్రం వొచ్చాక ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీ కరణలో భాగంగా 33 జిల్లాలో చేశారు. దేశంలో ఇంతటి అరుదైన నిర్ణయం తెలంగాణలో మాత్రమే జరిగింది. ప్రధానంగా కెసిఆర్ ఇప్పుడు రైతుల ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారు. రైతుబంధుతో పాపులర్ అయిన కెసిఆర్ ఇప్పుడు వారినే నమ్ముకున్నారు. అలాగే వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన వారినే వోటు బ్యాంక్ గా గ్రహించారు. ఇందులో భాగంగానే భారతదేశంలోనే గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు, ధనవంతు లైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పుకోవాలన్నారు. ఇదే విషయాన్ని ఆయన పదేపదే చెబుతున్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా యన్నారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతున్నారు. దేశంలోనే అతి ఎక్కువ సమయం లో ఆర్థికప్రగతి సాధించాం.. అతికొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించుకున్నాం. మిషన్ భగీరథ..కాళేశ్వరం ప్రాజెక్ట్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం..ఇవన్నీ కూడా కెసిఆర్ కలల ప్రాజెక్టులు. నీళ్లు,నిధులు నియామ కాలు అన్న స్లోగన్తో ఉద్యమాన్ని గమ్యం చేరేలా చేసి…అధికారం చేపట్టిన తరవాత ఇలాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం అమలవుతున్న వాటిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ముఖ్య మైనవి. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా తెలంగాణ ఓ వెలుగు వెలుగనుంది.
దేశానికి ఈ పథకం ఆదర్శంగా మారింది. ఇప్పుడు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం సాగుతోంది. రెండు పడక గదుల ఇళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియనూ సర్కారు వేగవంతం చేసింది. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని చెప్పుకోవాలి. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందజేసే మిషన్ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటివి పేదలకు వరంగా నిలిచాయి. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్ అయ్యింది. నాలుగేళ్లుగా మొక్కల పెంపకం పెద్ద ఉద్యమంగా సాగుతోంది. నిరంతర విద్యుత్,నీటి సరఫరా, ఎరువులు విత్తనాలు అందచేత, పెట్టుబడి సాయం కింద ఎకరాకు 8వేలు అందచేసే కార్యక్రమం, రైతులకు బీమా పథకం..ఇవన్నీ కూడా అద్భుతాలు గానే చూడాలి. కెజి టూ పిజిలో భాగంగా గురుకులాల ఏర్పాటు కూడా ఓ విప్లవాత్మకమైన మలుపుగా చెప్పుకోవాలి. పేదలకు ఉచిత విద్యను అందించే క్రమంలో ఇదో అపురూపమైన ఘట్టంగా చెప్పుకోవాలి. చేపట్టిన పనిని చివరి వరకు వదలకుండా చేసే మొడి ధైర్యం కెసిఆర్ది. తను చేపట్టిన పని విజయవంతంగా పూర్తి చేయడమే తప్ప వెనుదిరిగి చూడని ధృడచిత్తం కెసిఆర్కే సొంతం. అందుకే వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దిల్లీలో పాగా వేస్తామని అంటున్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్ బలంగా ఢీకొనబోతున్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు పథకాలను మళ్ళీ ప్రజలకు వివరిస్తారో..ఎలా మచ్చిక చేసుకుంటారా అన్న ప్రణాళికలు రూపొందుతున్నాయి.. ఇక్కడ అసెంబ్లీలో గెలవాలి… దిల్లీలో పాగా వేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగబోతున్నారు.
– ప్రజాతంత్ర డెస్క్