- కిసాన్ ,మాజ్దూర్ బచావో దివస్ గా కార్యక్రమాలు ..
- రేపు ఎల్లుండి లోగా దుబ్బాక అభ్యర్థిని ప్రకటిస్తాం ..
- గ్రాడ్యుయేట్ ఎన్నికలో పొత్తు పై సబ్ కమిటి సూచన చేస్తుంది ..ఉత్తమ్
వ్యవసాయ చట్టలతో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు .కార్పొరేట్ల కోసమే కొత్త చట్టాలను తీసుకొని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో అన్ని రంగాలను దివాళా తీసి కార్పొరేట్ వ్యాపారులకు దోచిపెడుతున్నారని ఇప్పుడు కొత్తగా మూడు చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేస్తున్నారని విమర్శించారు. గురువారం నాడు ఆయన కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తో కలిసి జూమ్ ఆప్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పై విరుచుకుపడ్డారు.అక్టోబర్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దివస్ గా కార్యక్రమాలు జరుపుతున్నామని అన్నారు .కలెక్టరేట్ దగ్గర కానీ, గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు పంట నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించి బ్లాక్ మార్కెట్ చేసుకునే విధంగా చేయడం దారుణమని మద్దతు ధరకే పంట కొనుగోలు చేయాలని చట్టంలో ఎందుకు పొందుపరచడం లేదని ప్రశ్నించారు.
కాంట్రాక్టు ఫార్మింగ్ తెచ్చి చిన్న సన్నకారు రైతులకు తీవ్ర నష్టం చేయబోతున్నారని రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించడంలో కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అసెంబ్లీని సమావేశ పరిచి ఆర్టికల్ 254 ప్రకారం కేంద్ర చట్టాలు అమలు కాకుండా తీర్మానాలు చేయాలని కేసీఆర్ ని డిమాండ్ చేశారు.నేడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని నేటి నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేసి నవంబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతుల సంతకలతో సోనియా గాంధీ రాష్ట్రపతికి నివేదిక ఇస్తామన్నారు.ఇక కేసీఆర్ రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని తెలంగాణ రైతులకు పంట నష్ట పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ,తెలంగాణ రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు.దుబ్బాక అభ్యర్థి ని రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తామని ,దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామన్నారు . గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు పై సబ్ కమిటీ సూచన చేస్తుందన్నారు.
పేద ప్రజల రక్తం పీల్చుకునేందుకే ఎల్.ఆర్.ఎస్. …ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్
నీళ్లు , నిధులు, నియామకాలు మీద ఏర్పడిన తెలంగాణ లో అవేవి నేరవేరడం లేదని ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశ ఏర్పడిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చాంద్ రెడ్డి విమర్శించారు.అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉందన్నారు.గురువారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని ఆరోపించారు.కరోనా విషయంలో సర్కారు పూర్తి వైఫల్యం చెందిందని పేదవారు సర్కారు దావఖానకు వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు .కోవిడ్ విషయంలో వైఫల్యం చెందిన సర్కార్ పేదల రక్తం పీల్చుకునేందుకు ఎల్.ఆర్.ఎస్.తో దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ను కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని , 2.70లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్న భర్తీ చేయడంలేదని మండిపడ్డారు.6 ఏళ్లలో కేవలం 30వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని , ఈ 6 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కువనా తొలగించిన వారు ఎక్కువ నా అనేది స్పష్టం చేయాలని అన్నారు . ఉద్యోగుల కు పీఆర్సీ , ఐ.ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేసారు. సీపీఎస్ విధానం పై టీ.ఆర్.ఎస్ వైఖరిని స్పష్టం చేయాలని తక్షణమే ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు .