తిరుపతి,జనవరి6: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి కపిల తీర్థంలోని పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పోత్సవాన్ని కనులార తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి వారి పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో పార్థసారథి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.