*జయంతి సందర్భంగా నివాళి అర్పించిన సిఎం కెసిఆర్
*రాష్ట్ర ప్రజలకు తెలంగాణా భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు
ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. ప్రజల్లో చైతన్యదీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రవీంద్ర భారతిలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. పుటక నీది చావు నీది. బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది కాళోజీ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా శాసన మండలిలో మంత్రి కాళోజీ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా పోరాడారని మంత్రి తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజాకవి కాళోజీ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భూమి పుత్రుడు, ప్రజాకవి కాళోజీ జన్మదినం సందర్భంగా మంత్రి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని అన్నారు. మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటారని కొనియాడారు. భాష రెండు విధాలుగా ఉంటుందని, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష అని.. పలుకుబడుల భాష కావాలని చెప్పిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ అని అన్నారు.