కన్నుల పండువగా కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం
ఆ వంశంలో పుట్టడం అదృష్టం, గౌరవం : వారసుడు కమల్ చంద్రబంజ్
సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళా రూపాల ప్రదర్శనతో కాకతీయుల వారసుడు కమల్ చంద్రభంజ్ దేవ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్, వేయిస్తంభాల దేవాలయం, అగ్గలయ్య గుట్ట, దేవాలయాలను దర్శించుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కాకతీయ వైభవ సప్తాహం నగరంలో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ వినయభాస్కర్లు ఘనస్వాగతం పలికారు. మొదట భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాల ద్వారా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోచమ్మమైదాన్లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుండి వరంగల్ కోటకు చేరుకున్నారు. గుర్రాల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకతీయుల చరిత్రను తెలుసుకోవడంతో పాటు కళా సంపదను ఆస్వాదిస్తూ చంద్రబంజ్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వేయిస్తంభాల దేవాలయం, అగ్గలయ్య గుట్ట దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా కాకతీయ హరిత హోటల్లో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశలో ఆయన మాట్లాడుతూ కాకతీయుల వంశంలో పుట్టడం తన అదృష్టంగా, గర్వంగా ఉందన్నారు. వారి పూర్వీకుల కళా సంపద అద్వితీయం, అపూర్వమన్నారు. ఓరుగల్లు ప్రజలు కలకాలం సుఖ, సంతోషాలతో ఉండాలన్నారు.
కాకతీయుల గొప్పతనాన్ని గుర్తుంచుకొని వేడుకలు నిర్వహిస్తునందుకు, ఈ వేడుకల్లో తనను భాగస్వామిని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కాకతీయ వైభవం వేడుకలను కాకతీయుల కళా వైభవం, ఆచార సంప్రదాయాలు ప్రతి బింబించే విధంగా నిర్వహిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భాగస్వాములై వేడుకలను విజయవంతం చేయాలన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం కళలకు, కళాకారులకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఈ కాకతీయ వైభవ సప్తాహం నిర్వహిండం జరుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు సాధించిన విజయాలు, వారి చరిత్ర గొప్పదని వారి గురించి అందరికీ తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసిఆర్ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రజలు ఋణపడి ఉంటారన్నారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద జిల్లాగా గుర్తింపు ఉందన్నారు.
కాకతీయుల వైభవం వారి చరిత్ర గురించి అందరికీ తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. గురువారం నుండి 13 వరకు వేడుకలు జరుగుతాయని తెలిపారు. ప్రజలందరూ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాకతీయుల వైభవం సప్తాహం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజు కమల్ చంద్ర బంజ్ దేవ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపి పసునూరి దయాకర్, ఈ కార్యక్రమంలో డైరక్టర్ ఆఫ్ కల్చర్ మామిడి హరికృష్ణ, రెండూ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ గోపి, సిపి డాక్టర్ తరుణ్ జోషీ, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రానిణ్య, అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.