- నేడు విపక్షనేతలతో రాహుల్ వ్యూహాత్మ భేటీ
- ప్రభుత్వంపై వొత్తిడి తెచ్చే విషయమై చర్చ
న్యూఢిల్లీ, ఆగస్ట్ 2 : పార్లమెంట్లో ప్రతిష్ఠంభన నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పార్లమెంట్కి దగ్గరలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో అల్పాహార విందుకు రావాలని విపక్ష నేతలను రాహుల్ ఆహ్వానించారు. అన్ని విపక్ష పార్టీల ఎంపీలు, ప్లోర్ లీడర్లను అల్పాహార విందుకు ఆహ్వానించారు. కొంతకాలంగా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఇలాంటి అన్ని సమావేశాలకు గైర్హాజరవుతున్న టీఎంసీకి సైతం ఆహ్వానం అందించినట్లు సమాచారం. కాగా, పెగసస్, ధర పెరుగుదల,నూతన వ్యవసాయ చట్టాలు సహా వివిధ సమస్యలపై చర్చించాలని ప్రతి రోజూ విపక్ష పార్టీలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి.
వీటిపై చర్చించేందుకు వీలుగా పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతున్నాయి. అయితే, కేంద్రం మాత్రం పెగసస్ వ్యవహారం అసలు సమస్యే కాదని చెబుతుంది. ఈ నేపథ్యంలో పెగసస్ వ్యవహారంపై మోదీ సర్కార్ని ఇరుకున పెట్టే విధంగా సంయుక్త వ్యూహాన్ని రచించడం సహా ఎన్డీఏ సర్కారును ఇరుకున పెట్టేందుకు వివిధ అంశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేలా ఈ సమావేశంలో చర్చలు జరపనున్నట్లు సీనియర్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు తెలిపారు. అంతేకాకుండా విపక్ష పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన మార్చ్ నిర్వహించనున్నారని,పార్లమెంట్ వరకూ ఎంపీలు నడుచుకుంటూ వెళ్తనున్నట్లు సమాచారం.