జననాట్య మండలి జంగ్ ప్రహ్లాద్ తుదిశ్వాస..!
జననాట్య మండలి కళాకారుడు, తెలంగాణ ఉద్యమ కార్యకర్త, గేయ రచయిత జంగ్ ప్రహ్లాద్ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పాత్రతోపాటు తెలంగాణా ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమికను పోషించిన ప్లహ్లాద్ మృతి కళామతల్లికి జన నాట్య మండలికి, కళాకారుల లోకానికి తీరనిలోటు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయనకు ముగ్గురు పిల్లలు. హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆయన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యారు.
ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్కి తరలించినా చికిత్స ఫలించలేదు. హాస్పిటల్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతితో జన నాట్య మండలి, కళామతల్లి కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జంగ్ ప్రహ్లాద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పలు సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. జంగ్ ప్రహ్లాద్ సాంస్కృతిక కృషి ఎప్పటికీ మరువలేమన్నారు. ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.