“ఆమె జెసిసి మీడియా కోఆర్డినేటర్. డిసెంబర్లో తన యూనివర్సిటీలో సిఎఎకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు నాయకత్వం వహించారు. ఫిబ్రవరి 22-23 తేదీల్లో ఢిల్లీలో జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కింద సిఎఎ వ్యతిరేక నిరసనలో భాగంగా రహదారి దిగ్బంధనాన్ని నిర్వహించిన వారిలో సఫూరా జర్గర్ కూడా ఉన్నారని పోలీసులు తెలుపుతూ జర్గర్ను ఏప్రిల్ 13న అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో, జర్గర్ 13 వారాల గర్భవతి. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఆమె పాత్ర ఉందని ఆరోపించిన ప్రభుత్వం ఆమెను యుఎపిఎ చట్టం కింద తీహార్ జైలులో పెట్టింది.”

కరోనా లాక్ డౌన్కి ముందు మీడియాలో నానిన వార్తా జామియా మిలియా ఇస్లామీయా యూనివర్సిటీ సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ల నిరసనలు. ఇవి కేవలం సంఘటనలు మాత్రమే కావు. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ గొంతు లేపి ప్రభుత్వాన్ని నిలదీసిన నినాదాలు ఈ సంఘటనలు. కరోనా లాక్ డౌన్లో ఈ ఎలుగెత్తిన గొంతులు ఎలా ఉన్నాయో తెలుసా..మనం లాక్ డౌన్లో ఇళ్లల్లో అమెజాన్..నెట్ ఫ్లిక్స్ చూస్తున్నాం. మరి ప్రభుత్వాన్ని నిలదీసిన వాళ్ళు ఇంటిలో సేఫ్గా ఉన్నారా..? జైల్లో మగ్గుతున్నారా..? ఈ ప్రశ్నకి సమాధానం కాశ్మీర్ మూలాలు వున్న సఫూరా జర్గర్ ప్రస్తుత వ్యథ తగు సమాధానం చెబుతుంది.
జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి ఆమె. పేరు సఫూరా జర్గర్. వయసు 27 ఏళ్ళు. ఆమెను తిహార్ జైలుకు పంపించి మూడు వారాలు అయ్యింది. అప్పటి నుండి ఆమె ఒంటరిగా తీహార్లో గడుపుతున్నారు. భర్తతో మాట్లాడే అవకాశం రాక రాక మంగళవారం వచ్చింది. జైలుకి పోయినాక ఆమె రెండవసారి భర్తతో మాటాడారు. కేవలం నాలుగు నిమిషాల పాటు జరిగిన సంభాషణలో, రెండుసార్లు కాల్ డ్రాప్ జరిగింది. ఆ కొద్దీ మాటలలో సఫూరా జర్గర్ తల్లిదండ్రులు, అత్తమామల ఆరోగ్యం, యోగ క్షేమాలు, వారి శ్రేయస్సు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతకీ ఎవరు ఈ సఫూరా జర్గర్..? జామియా మిలియా ఇస్లామియాకు చెందిన ఎంఫిల్ విద్యార్థి సఫూరా జర్గర్. గత డిసెంబర్లో ఆమోదించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలో కొన్ని వారాలపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన జామియా కోఆర్డినేషన్ కమిటీ (జెసిసి)తో జర్గర్ సంబంధం కలిగి ఉన్నారు. ఆమె జెసిసి మీడియా కోఆర్డినేటర్. డిసెంబర్లో తన యూనివర్సిటీలో సిఎఎకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు నాయకత్వం వహించారు. ఫిబ్రవరి 22-23 తేదీల్లో ఢిల్లీలో జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కింద సిఎఎ వ్యతిరేక నిరసనలో భాగంగా రహదారి దిగ్బంధనాన్ని నిర్వహించిన వారిలో ఆమె కూడా ఉన్నారని పోలీసులు తెలుపుతూ జర్గర్ను ఏప్రిల్ 13న అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో, జర్గర్ 13 వారాల గర్భవతి. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఆమె పాత్ర ఉందని ఆరోపించిన ప్రభుత్వం ఆమెను యుఎపిఎ చట్టం కింద తీహార్ జైలులో పెట్టింది. జర్గర్ న్యాయవాది ఇటీవల బెయిల్ పిటిషన్ వేశారు. ఆమెను తప్పుగా ఇరికించారని ఎఫ్ఐఆర్లో ఆమె పేరు లేదని ఢిల్లీ కోర్టుకు తెలిపారు. అయితే ఇది తిరస్కరించబడింది. ఆమె గర్భవతి అని కోర్టుకు చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 437 నిబంధనను ప్రకారం ఆమెను బెయిల్పై విడుదల చేయవచ్చని కూడా చెప్పారు.
ఈ పరిస్థితి జార్గర్ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తుండగా – లాక్డౌన్ సమయంలో అరెస్టు వలన కలవలేకపోతున్నామని మా పరిస్థితి ‘‘నెమ్మదిగా మరణం’’ లాగా ఉందని ఆమె సోదరి బహిరంగ లేఖ రాసింది. కేవలం సఫూరా జర్గర్ మనో బలం, ధైర్యం కారణంగా ఆమె జైలు నుండి బయటకు వస్తుందని కుటుంబం నమ్ముతున్నది. జర్గర్ సహచరులు, ఉపాధ్యాయులు ఆమె నిర్భయంగా మాటాడే ప్రకాశవంతమైన విద్యార్థిని అని చెప్పారు. ఆమె ఉపాధ్యాయులలో ఒకరు సఫూరా జర్గర్ని బడ్డింగ్ స్కాలర్ అని చెప్పారు. ఆమె గర్భధారణకు సంబంధించి సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చూడటం నాకు చాలా బాధగా ఉంది. ఇది మన సమాజ పతనం యొక్క ప్రతిబింబం. ముస్లిం మహిళలు లేదా హిందూ మహిళల ప్రశ్న కాదు. ఇది స్త్రీత్వం, మహిళల గౌరవాలకు సంబంధించిన అంశం అని చెప్పారు. ఆమె భర్త ఇలా అంటున్నారు ‘‘మేము ప్రజాస్వామ్యాన్ని వాక్ స్వేచ్ఛను నమ్ముతున్నాము, కాబట్టి ఇలాంటివి జరుగుతాయని ఊహించ లేదు. మనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండాలి. మాకు న్యాయం నిరాకరించబడదని త్వరగా న్యాయం అందుతుందని మేము ఆశిస్తున్నాము.’’ సఫూరా జర్గర్ వ్యధ తెలిపేది ఒక్కటే లాక్ డౌన్ అందరికి ఒకే తీరున లేదు.