పలు చోట్ల ఏకకాలంలో ఐటి సోదాలు
హైదరాబాద్, మే 2 : హైదరాబాద్లో మరోమారు ఐటీ సోదాల కలకలం రేగింది. వస్త్ర వ్యాపారులకు చెందిన ఇల్లు సహా దుకాణాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకంగా 40 చోట్ల ఒకే సమయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, అర్పేట, ఏఎస్ రావు నగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, విశాఖపట్నంలో కూడా వస్త్రవ్యాపారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను చెల్లించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్కస్, కేఎల్ఎం షాపింగ్ మాల్ యజమానుల ఇళ్లు, షోరూంలు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.