Take a fresh look at your lifestyle.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ రైడ్స్

  • వసుధ ఫార్మా, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో సోదాలు
  • 40 ప్రాంతాల్లో 50 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు

హైదరాబాద్‌, ‌జనవరి 31 : మరోసారి ఏపీ, తెలంగాణలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో 50 టీమ్స్ ఏకంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ రైడ్స్ ‌కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా పేరుతో రాజు అనే వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ ‌చేస్తున్నాడు. మొత్తం 15 కంపెనీల పేరుతో రాజు రియల్‌ ఎస్టేట్‌ ‌చేస్తున్నట్లు ఐటీ గుర్తించింది. ఈ ఫార్మా కంపెనీకి రాజు చైర్మన్‌ ‌గా ఉండగా..ఆరుగురు డైరెక్టర్లు కార్యకలాపాలు చూస్తున్నారు. వీరందరి ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అలాగే ఏపీలోని విజయవాడ, విశాఖ, గుంటూరులో కూడా ఐటీ రైడ్స్ ‌జరుగుతున్నట్లు తెలుస్తుంది. రైడ్స్ ‌ముగిసిన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ అధికారులు భారీగా పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్స్ ‌స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్‌ , ఎం‌పీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్‌ ‌మాల్స్ ‌లో కూడా అధికారులు రైడ్స్ ‌చేశారు. ఇక గత నెలలో కూడా వంశీరామ్‌ ‌బిల్డర్స్ ‌కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. అయితే హైదరాబాద్‌ ‌లో వరుస ఐటీ రైడ్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కొన్నిరోజుల్లో ఎన్నికలు ఉండగా ఐటీ అధికారులు తరచూ రైడ్స్ ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్‌ ‌పెడుతున్నాయి.

Leave a Reply