- గీతకార్మికులకు దక్కని సాయం
- పాదయాత్రలో ప్రజలతో లోకేశ్ చర్చ
చిత్తూరు, ఫిబ్రవరి 4 : పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్ సైట్ లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం భేటీ అయ్యారు. పాదయాత్రలో భాగంగా వారితో లోకేష్ మాట్లాడుతూ … గీత కార్మికులకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని, ఈడిగలకు ఎలాంటి ఆర్ధిక సహాయం అందించలేదని అన్నారు. కల్తీ మద్యం అమ్మకం కోసం జగన్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులను వేధిస్తుందని ఆరోపించారు. మద్యం షాపుల్లో 25 శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించాలని కోరారు. 45 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేశారని విమర్శించారు.పూతలపట్టు నియోజకవర్గం బీసీలు మాట్లాడుతూ … ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 లక్షల మంది వ్డడెర్లు ఉన్నారనీ, తమను ఎస్టీల్లో చేర్చాలని కోరారు.
బండలు కొట్టడం, మట్టి పనులు చేసి జీవిస్తామని, యాంత్రీకరణ వలన ఉపాధి లేక ఇతర రాష్టాల్రకు వలస వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల్లో కొంత శాతం తమకు కేటాయించాలన్నారు. విశ్వ బ్రాహ్మణులు మెషినరీ వలన ఉపాధి కోల్పోతున్నారనీ, స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ముదిరాజుల బీసీ డి నుండి బీసీ ఏ కి మార్చాలని, నిధులు ఉండే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. పద్మశాలి సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, వైసిపి కార్యకర్తలకు మాత్రమే సర్టిఫికేట్ ఇస్తున్నారని ఆరోపించారు. రజకలు వెనుకబడి ఉన్నారని, దోబి ఘాట్స్ కానీ రుణాలు కానీ ఇవ్వడం లేదని అన్నారు. కురుబలకు తీవ్ర అన్యాయం చేసింది వైసిపి ప్రభుత్వమేనని ఆరోపించారు.
80 లక్షల మంది కురుబ సామాజిక వర్గంవారు రాష్ట్రంలో ఉన్నారనీ, అయినా తమను చిన్న చూపు చూస్తుంది వైసిపి ప్రభుత్వం అని, ఒక్క సంక్షేమ కార్యక్రమం అందడం లేదని విమర్శించారు. యాదవ సామాజిక వర్గం తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పారు. గొర్రెలు, మేకలు పెంపకం పై తాము ఆధారపడి బతుకుతున్నామన్నారు. జగన్ ప్రభుత్వం కుర్చీ లేని కార్పొరేషన్ ఇచ్చిందని, ఒక్క గొర్రె పిల్లని కూడా ఇవ్వలేదని బీసీలు ఆరోపించారు. నారా లోకేష్ మాట్లాడుతూ … బీసీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది టిడిపి పాలనలోనేనన్నారు. తాను జగన్ లా మోసపు హాలు ఇవ్వబోనని అన్నారు. టిడిపి పాలనలో బిసిలకు ఇచ్చినన్ని నిధులు ఎవ్వరూ ఇవ్వలేదన్నారు.