- హిండెన్ బర్గ్పై కూడా చేస్తారా…
- బీబీసీపై ఐటీ దాడుల్ని ఖండించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై మంగళవారం ఐటీశాఖ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో స్పందిస్తూ…. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ ప్రసారం అయ్యిందని, ఇప్పుడు భారత్లోని బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు నవ్వులపాలు అవుతున్నాయని, ఆ సంస్థలు బీజేపీ కీలుబొమ్మలుగా మారినట్లు కేటీఆర్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్.. తర్వాత ఎటువంటి చర్యను తీసుకుంటారని అడిగారు. అదానీ స్టాక్స్పై నివేదిక ఇచ్చిన హిండెన్బర్గ్ సంస్థపై ఐటీ దాడి చేయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. లేదంటే ఆ సంస్థనే టేకోవర్ చేసుకుంటారా అని ఆయన విమర్శించారు. బీబీసీపై ఐటీ రెయిడ్స్కు సంబంధించి వివిధ మీడియా సంస్థలు రాసిన కథనాలను తన ట్వీట్లో మంత్రి ట్యాగ్ చేశారు.