- ఈటల ప్రమేయంపై పూర్వపు కలెక్టర్ ధర్మారెడ్డి సిఎం కేసీఆర్కు నివేదిక
- ఈటల కబ్జాపై విచారణకు సర్కార్ ఆదేశం
- రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్….
(ఎ.సత్యనారాయణరెడ్డి / హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):
టిఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా, బిసి నేతగా ఉంటూ ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ•ల రాజేందర్పై సిఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారా? ఫలితంగా ఆయనపై వేటుపడే అవకాశం ఉందా?కేబినెట్ నుంచి తప్పించేందుకు సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారా? అంటే, ఔననే అంటున్నాయి అత్యంతమైన విశ్వసనీయవర్గాలు. సిఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వస్తున్న ఈటల రాజేందర్ను సిఎం కేసీఆర్ తన కేబినెట్ నుంచి తప్పించడానికి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట శివారులో ఆయన బడుగు బలహీన వర్గాల(చాకలి, ఎరుకుల)కు చెందిన అసైన్డ్ భూములను గుంజుకోవడమేననీ తెలుస్తుంది. అచ్చంపేటలో రాజేందర్కు ఉన్న పౌల్ట్రీ హ్యాచరీస్ చుట్టూ ఉన్న సర్వే నెంబర్ 130/7, 130/9, 130/10లో గల సుమారు 20ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేయడమే కాకుండా త•న భార్య జమున, కుమారుడు నితిన్ పేరిట ఈ అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలంటూ ఈటల రాజేందర్ తన మంత్రి పదవీని ఉపయోగించి మెదక్ జిల్లా రెవెన్యూ అధికారులను వొత్తిళ్లు చేయడం, బెదిరింపులకు పాల్పడినట్లు… అసైన్డ్ భూముల కబ్జాలో మంత్రి ప్రమేయంపై గతంలో మెదక్ జిల్లా కలెక్టర్గా పని చేసిన ధర్మారెడ్డి సిఎం కేసీఆర్ సమగ్రమైన నివేదికను నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. అచ్చంపేటలో మంత్రి ఈటల రాజేందర్ బడుగు, బలహీన వర్గాల భూములు కబ్జాలకు పాల్పడి పౌల్ట్రీ హ్యాచరీస్ షెడ్ల నిర్మాణాలు చేపట్టారనీ, ఇదేమనీ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతానంటూ మంత్రి రాజేందర్తో పాటు ఆయన అనుచరులు సూరి, యంజాల సుధాకర్రెడ్డి బాధితులను బెదిరించినట్లు తెలుస్తుంది. దీనిపై రైతులు సైతం ఇది వరకే సిఎం కేసీఆర్కు కూడా తమ గోడును వెళ్లబోసుకున్నారనీ సమాచారం.
తాజాగా ఇదే విషయమై అచ్చంపేటకు చెందిన పలువురు బాధితులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్, ఎంపి తదితరులకు లిఖితపూర్వకుంగా ఫిర్యాదు చేయడంతో తాజాగా…ఈటల రాజేందర్ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. అచ్చంపేటలో ఈటల రాజేందర్ హ్యాచరీస్ నిర్మించడానికి ఐదేండ్ల కిందట పూనుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవీ నుంచి రాజేందర్ను తప్పించాలనీ సిఎం కేసీఆర్ కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయవర్గాల్లో ముఖ్యంగా అధికార టిఆర్ఎస్ పార్టీలోనూ జోరుగా చర్చ సాగుతున్నది. అంతేకాకుండా, రాజేందర్పై వచ్చిన భూ కబ్జాల ఆరోపణకు సిఎంవో స్పందించింది. జరిగిన కబ్జాలపై సమగ్రమైన విచారణ జరిపించి నివేదిక పంపాలని మెదక్ జిల్లా కలెక్టర్తో పాటు విజెలన్స్ శాఖను కూడా అధికారికంగా ఆదేశించింది.