న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి, అందరికీ సమ న్యాయం జరగాలి. సామాన్యునికైనా సంపన్నునికైనా చట్ట ప్రకారం ఒకే విధంగా న్యాయం జరగాలి .ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు, కానీ అది డైలాగ్ వరకు మాత్రమే పరిమితం. వాస్తవంలోనికి తొంగి చూస్తే పూర్తి విరుద్ధంగా ఉంటుంది.సామాన్యులైన ఆదివాసి అడవి బిడ్డలకు అన్యాయం జరిగిందని చెప్పడమే న్యాయం జరిగినట్లు హర్షాతిరేకలు వ్యక్తం చేయడం విచారకరం. అది కూడా అన్యాయం జరిగిన 16 సంవత్సరాలకు దోషులకు శిక్ష లేకుండా బాధితులకు అన్యాయం జరిగిందని న్యాయస్థానం గుర్తించడం, ఎట్టకేలకు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించినందుకు అడవి బిడ్డలు సంతోషంతో సర్దుకుంటున్నారు. ఎందు కంటే తమపై అత్యాచారం జరిగిందని మాకు న్యాయం చేయండి అని ఆదివాసి మహిళలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తే కేసు కూడా ఫైల్ చేయలేదు .చట్ట ప్రకారం నిందితుల్ని అరెస్టు చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా వ్యవహరించాల్సిన అధికారులు, అసలు అలాంటి ఘటన జరగలేదని తెలపడం ఆశ్చ ర్యకరం.
ఆ ప్రాంతపు ప్రజా ప్రతినిధులు వారి పక్షాన నిలబడి పోరాడితే గాని కేసు విచారణ ప్రారంభం కాలేదు .కేస్ సాక్షదారాలు లభించకుండా తత్సారం చేస్తూ ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ ,వారి వెంట నడిచే వారిని బెదిరించి ప్రలోభాలకు గురిచేసి బాధిత మహిళలను వేధింపులకు గురి చేయడం జరిగింది,.అయినను ఆదివాసీ మహిళలు ధైర్యంతో న్యాయం కోసం తిరుగని చోటు ఎక్కని కోర్టు మెట్లు లేవు .న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేయడ•ం, ఆ పోరాటంలో తుది వరకు నిలబడితే విచారణ జరిపిన ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు ఏప్రిల్ 6 2023న వెల్లడించింది .తీర్పులో నిందితులను నిర్ధారణ చేసేందుకు సరియైన ఆధారాలు లేవని నేరానికి నిందితులకు మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని దర్యాప్తు నిర్వహించిన ఇద్దరి అధికారులపైచర్య తీసుకోవాలని బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. 2007ఆగస్టు 20వ తేదీ తెల్లవారుజామున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో జిమాడుగుల మండలం వాకపల్లి ఆదివాసి గ్రామంలో నక్సల్స్ వ్యతిరేక పోలీస్ దళం కుంబి0గ్ కు వచ్చింది. ఆ గ్రామంలోని పురుషులంతా తమ పొలాలకు పనులకు వెళ్లారు స్త్రీలు మాత్రమే ఇండ్లలో ఉన్నారు. వీరిపై 13 మంది పోలీసులు దాడి చేసి 11 మంది ఆదివాసి మహిళలపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేశారు. రక్షించాల్సిన రక్షకబటులే భక్షించారు. కంచే చేను మేచిన చందంగా సభ్య సమాజం తలదించుకునేలా అత్యాచారంజరగడం ఒక ఎత్తు అయితే..
పాలక అధికార వర్గాలు స్పందించక పోవడం మరో ఎత్తు. బాధ్యతా యుతమైన వ్యక్తులు కాపాడి ఆదుకోవాల్సిన వారే నేరానికి పాల్పడితే పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను శిక్షించి అమాయకపు అభం శుభం తెలియని, అబద్ధం ఎరుగని ఆదివాసీ మహిళల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన పాలకపక్షం పక్షం వకల్తా పుచ్చుకొని నేరాన్ని కప్పిపుచ్చడానికి ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు చేయ కుండా, అత్యాచార ఆరోపణలు అవాస్తవ మని అసత్యమని తేలికగా కొట్టిపారే శారు. అత్యాచారాలు జరిగిన సందర్భాలలో చట్టబద్ధంగా జరపవలసిన మెడికల్ పరీక్షల కోసం ప్రజాప్రతి నిధులు ప్రజా సంఘాలు డిమాండ్ చేయవలసి వచ్చింది. అత్యాచారం జరిగిన 12 గంటల లోపే బాధితులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తనే నేర నిర్ధారణ జరుగుతుందని వైద్యశాస్త్రం వివరిస్తుండగ .. బాధితులైన అయినా మహిళ లకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేసి నేరం రుజువు కాకుండా ఉండేందుకు ఆధారాలు లభించకుండా చేసేందుకు ప్రయత్నించడం సామాన్యులకు న్యాయం అందించాలనే అంశంపై రాజ్యం చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు .ఈ అడవి బిడ్డల సుదీర్ఘ న్యాయ పోరాటం క్రమం ఒకసారి పరిశీలిద్దాం…2007 ఆగస్టు 20న తెల్లవారు జామున ఈ దుశ్చర్య జరిగింది. ఆగస్టు 20,2007 సాయంత్రం 5.30 గంటలకు పాడేరు సబ్ కలెక్టర్ గారికి 11 మంది బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో సబ్ కలెక్టర్ గారి గారి ఆదేశాల మేరకు పాడేరు పోలీసులు పీసీ 372 సబ్ సెక్షన్ 4 ప్రకారం ,సెక్షన్ 3 సబ్ సెక్షన్ రెండు ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అనకాపల్లికాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి , అటునుండి విశాఖ పట్టణంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహిం చారు.
ఆగస్టు 22, 2007న 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులను విడి విడిగా పిలిపించి విచారణ చేశామని అత్యాచార ఘటన ఏది జరగలేదని అప్పటి ఉన్నతాధికారి ప్రకటించారు. ఆగస్టు 24 ,2007 బాధిత మహిళలు హైదరాబాదుకు వెళ్లి స్వతంత్ర న్యాయ నేర పరిశోధన సంస్థతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు . ఆగస్టు 28న హైకోర్టు ఆదేశాల మేరకు చోడవరంలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు 11 మంది బాధిత మహిళల వాంగ్మూలం రికార్డు చేశారు.ఆగస్టు 29న అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆగస్టు 30న వాకపల్లి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా ఎస్పీకి ,రాష్ట్ర డిజిపి కి నోటీసులు జారీ చేసింది. బాధిత మహిళల ఫిర్యాదు పై స్పందించడానికి 15 నెలలు పట్టింది .ఎన్నో పోరాటాల తర్వాత కేసులు నమోదు చేశారు .2007 నుంచి 2012 వరకు హైకోర్టులో విచారణ జరిగింది .అటు తరువాత సుప్రీం కు చేరింది . నిందితులుగాఉన్న పోలీసులు ఈ కేసు నుండి విముక్తి కల్పించాలని 2017 లో సుప్రీంలో లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల పిటిషన్ పై విచారణ స్వీకరించిన సుప్రీంకోర్టు 10 ఏండ్లుగా విచారణ గావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు చేసుకున్న పిటిషన్ను కోర్టు తోసి పుచ్చింది. అదేవిధంగా విశాఖలో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలల్లో విచారణ చేయాలని ఆదేశించింది. విచారణ చేయడానికి ఆరు నెలలు అని సుప్రీం కోర్ట్ గడువు విధిస్తే ఆ రేండ్లలో అనగా ఏప్రిల్ 6, 2023న ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చింది. మొత్తానికి వాకపల్లి న్యాయపోరాటం గిరిపుత్రికల చేదు జ్ఞాపక0. వారి ఆత్మగౌరవ పోరాటం నోరులేని అమాయక0. అమాయకపు అడవి బిడ్డలపై జరిగిన అఘాయిత్యమునకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పేరిట లోపాలు వారి పాలిట శాపాలుగా మారిన తీరుకు ఈ కేసు చక్కటి ఉదాహరణ.
డబ్బు లేకున్నా ,చదువు రాకున్నా ,చట్టాలు ,రాజ్యాంగం తెలియకున్న జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పిడికెడు మంది ఆదివాసీ మహిళల సుదీర్ఘ పోరాటం సమాజానికి కనువిప్పు కావాలి. నేరం జరగడం అతి దారుణం అయితే దానిని కనుమరుగు చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలన్నీ సహకరిం చడం, నేరాన్ని నమోదు చేయడంలో పలు తప్పిదాలకు తావు ఇవ్వడం , విచారణ అధికా రుల వైఫల్యంతో కేసు కొట్టి వేయడం జరిగింది. 38 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితులకు శిక్ష లేకుండా బాధితులైన నిరుపేద ఆదివాసి అభాగ్యులకు అన్యాయం జరిగిందని, నష్టపరిహారం చెల్లించాలన్న తీర్పుతో 16 ఏళ్లుగా మానసికంగా కృంగిపోయి, సమాజం చేత అవహేళన అవమానాలకు , ఛీదరింపులకు , బెదిరింపులకు గురైన మహిళలకు కొంత ఊరట కలిగించింది వాస్తవమే అయినప్పటికీ పూర్తి న్యాయం జరగలేదనడం నిజం. నేరమే జరగలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రచారం చేసిన వారికి ఇది సరైన జవాబు. వారి సుదీర్ఘాత్మ గౌరవ న్యాయ పోరాటం తర్వాత వారికి అన్యాయం జరిగిందనడమే న్యాయమనే తీర్పు వెలువడటం ఒకవైపు అయితే ..నేరం నిర్ధారించబడి శిక్షను అనుభవిస్తున్న నేరస్తులకు రేమిషన్ ఇచ్చి విడుదల చేసి పూలమాలలతో స్వాగతించడం ఏ మేరకు న్యాయమో.. సమంజసమో… ఏలికలకే తెలియాలి. దేశంలో కులాల ఆధిపత్య ఆదాయ అసమానతల అంతరాలు మాత్రమే కాకుండా న్యాయాన్ని అందుకోవడంలో విచారణ గావించ డంలో కూడా అంతరాలు ఉన్నాయనడానికి చక్కటి ఉదాహరణ. ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయం తో సమానం అన్నట్లు అది కూడా అన్యాయం జరిగిందని మాత్రమే తేల్చడం ఇంకా అన్యాయమే.. సత్వర న్యాయం అనేది అభాగ్యులకు నిరుపేదలకు ఆదివాసీలకు ఎంత దూరాన ఉందో ఈ ఘటన తెలియజేస్తుంది.ఆదివాసీల ఆడబిడ్డ దేశ అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ వారికి కొద్దిపాటి న్యాయం జరగడం కొసమెరుపు. ఆదివాసీల బ్రతుకు తెరువు కోసం తరతరా లుగా సాగు చేస్తున్న పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు అందించి ,అడవి నుండి దూరం చేయ కుండా ,అటవీ చట్టాలకు తూట్లు పొడవ కుండా కనీసఅవసరాలు ,మౌలిక వసతులు కల్పించి మూలనివాసులైన ఆదివాసి అడవి బిడ్డ లకు చేయూతని ఇవ్వాల్సిన బాధ్యత పాలక వర్గాలదే. కాకుల కొట్టి గద్దలకు వేసి దుర్మార్గాన్ని విడనాడి ,.సంపన్నులను కొట్టి పేదలకు పంచే ఆదర్శాన్ని స్వీకరించి కోటలు దాటే పాలకుల మాటలు ఆచరణ సాధ్యం కావాలని, ఆ దిశగా పాలకుల ప్రయత్నాలు ఉండాలని ఆశిద్దాం,….
తండ సదానందం,టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
మహబూబాబాద్.