ఫ్లోరెన్స్ నైటింగేల్ రోగుల సపర్యల నిమిత్తం కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి. నర్సింగ్ సేవలకు నిర్దిష్ట ప్రాతిపదికలు, ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో , రాత్రి వేళల్లో సైతం చేతిలో దీపంతో క్షత గాత్రులకు మానవత్వంతో, ప్రేమతో పరిచర్యలు చేసిన మానవతా మూర్తి, మహా మనీషి, భావి తరాలకు మార్గదర్శి. ఽది లేడీ విత్ ది లాంప్ ఽగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. ప్రపంచంలోనే తొలి నర్సింగ్ స్కూల్ స్థాపించింది.ఈ 2020 సంవత్సరానికి ఆమె జన్మించి రెండు వందల సంవత్సరాలు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఐసిన్ అంతర్జాతీయ నర్సుల వేడుకలకు నాయకత్వం వహిస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ దినోత్సవం థీమ్ 2020గా ‘‘నర్సింగ్ ది వరల్డ్ టూ హెల్ప్’’ తీసుకోవడం జరిగింది నర్సులు తీవ్రమైన అనారోగ్య సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర బిందువుగా మారడాన్ని ఈ థీమ్ సూచిస్తుంది. మహిళా ఉద్యోగినుల్లో 40 శాతానికి పైగా నర్సింగ్ వృత్తిలోనే వున్నారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఉపాధి మార్గంగా ఈ వృత్తి ముద్ర పడటం శోచనీయం. ఇప్పుడిప్పుడే అన్ని వర్గాల ప్రజలు ఈ వృత్తి లోకి ప్రవేశిస్తున్నారు. నర్సింగ్ వృత్తిని మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇదీ ఒక గౌరవ ప్రధానమైన వృత్తి. విదేశాలలో నర్సు లకు దక్కే గౌరవం అసాధారణం. అక్కడ యువ డాక్టర్లుసైతం సీనియర్ నర్సుల సలహాలు తీసుకుంటారు. నర్సుల సేవలలో మన దేశానికి విదేశాలలో మంచి పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ అవసరాలను భారతదేశం తీరుస్తున్నదన్న విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. మన దేశం లోని కేరళ నర్సులకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే చాల మంది నర్సులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. మన దేశంలో నర్సుల కొరత ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మన ఆసుపత్రుల్లో వసతులు, కనీస సౌకర్యాలు, జీత భత్యాలు తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత మెరుగయ్యాయని చెప్పవచ్చు.
అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ ఎదో ఒక సమయంలో నర్సుల సేవలను పొంది ఉంటారు. నిరంతరం రోగుల మధ్యనే వుంటూ జబ్బులతో పోరాటం చేస్తూ వుంటారు. అంటు రోగాలతో సహవాసం చేస్తుంటారు. రాత్రి వేళల్లో సైతం డ్యూటీలు చేస్తుంటారు. పని ఒత్తిడిని ఎదుర్కోవడం, ఎదుటి వ్యక్తి బాధలను ఓపికగా వినడం వారికి వృత్తిలో అలవాటు అయిన లక్షణాలు. వారి ఓదార్పు మాటలు, సేవలు రోగులకు మనోధైర్యాన్ని ఆత్మ స్టైర్యాన్ని కలిగిస్తూ వారి జబ్బులను సగం నయం చేస్తున్నాయని చెప్పవచ్చు. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు చేయలేని సేవలు కూడా వారు చేయడం మనం చూస్తున్నాం. ప్రమాదాల్లో గాయపడినవారికి, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు, అనారోగ్యం పాలైన వారికీ సేవలు చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. డాక్టర్లు ఎంత క్లిష్టమైన సర్జరీలు చేసినా సర్జరీ సమయంలో, సర్జరీ అనంతరం నర్సుల సేవలు లేనిదే రోగులు కోలుకోరు అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వైద్యులకు ధీటుగా సేవలను అందిస్తున్నారని చెప్పవచ్చు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో, గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణాల్లోని ఆసుపత్రుల్లో వీరి సేవలు మాటలకందనివి అని చెప్పవచ్చు. చాలామంది రోగులు డాక్టర్లకు చెప్పలేని విషయాలు కూడా వీరితో చెప్పుకొని వారు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. రోగులు వీరిని చాలా సమయాల్లో వారి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఆత్మీయ బంధువులుగా తలుస్తారు. ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో వీరి పాత్ర క్రియాశీలకం. సాధారణంగా వీరు సార్వత్రిక ఆరోగ్యం, తల్లి మరియు పిల్లల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర సంసిద్ధత మరియు రోగి భద్రతలో నిమగ్నమై వుంటారు. రోగుల ఆరోగ్యం బాగుచేయడంలో వీరిది కీలక పాత్ర. సేవే మార్గం -ప్రేమే లక్ష్యంగా ఈసేవా మూర్తులు రోగులకు సేవలను అందిస్తున్నారు. వీరి ఆత్మీయ స్పర్శ, పలకరింపు రోగులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పవచ్చు. సహజమైన ప్రేమతో, కరుణతో అమ్మలా వీరు సేవలను అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సేవా దృక్పథం వున్న వారే ఈ వృత్తిలో రాణిస్తారు. వీరు ఏ రకమైన వ్యాధికైనా వ్యాధిగ్రస్తులకు సేవలతో పాటు, వారిలో మానసిక స్థయిర్యం పెంపొందించడంలో వీరిది క్రియ శీలక పాత్ర. జాతి, కుల, మతాలకు అతీతంగా పనిచేస్తారు. ఆస్పత్రులలో జరిగే ఆరోగ్యసేవలన్నింటికీ వీరే మూలాధారం అని చెప్పవచ్చు.
ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స మరియు సంరక్షణను అందిస్తున్నారు..మొహంపై చెరగని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి బాధలో నున్న వారికైనా ఓదార్పునిస్తున్నారు. ఈ అపత్కాల సమయంలో నర్స్లు బాధితులకు కొండంత అండగా వుంటున్నారు. ప్రస్తుత కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్తో యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో నర్సులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్ తమనే అంతం చేస్తుందని తెలుసు. అయినా వారి లక్ష్యం ఒకటే. బాధితులను ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించడం. వారి సేవలు వెలకట్టలేనివి. ప్రమాదం అంచున నిలబడి వైరస్ బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారి ఉద్యోగ నిర్వహణలో భాగంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ క్రిమికి వారు కూడా వాహకంగా మారవచ్చు. అందుకే ఒకే ఇంట్లొ ఉన్నా వారికి ఎంతో ఇష్టమైన కుటుంబ సభ్యులకు, చిన్నపిల్లలకు కూడా దూరంగా ఉండే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే వీరి సేవలు మానవత్వనికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఈ విపత్కర సమయంలో ఒక యజ్ఞం వలె సేవలందిస్తున్న నర్సుల సేవలకు వెలకట్టలేం. కరోనా సోకితే కన్న బిడ్డ నైనా తాకలేం. బంధువులైనా, ప్రాణ స్నేహితులైరా సరే దగ్గరికి రాలేరు. ఒక రకంగా ఒంటరైన పేషేంటుకు హాస్పిటలే దిక్కు. అలాంటి పేషేంట్ దగ్గరకు ఆత్మీయంగా వచ్చి సేవలు అందించే వ్యక్తి అన్నీ తానై వ్యవహరించి అమ్మను మరిపిస్తుంది. ఈ కరోనా సమయంలో వైద్యుల కన్నా బిజీగా వుంటూ అదనపు పనిగంటలు పని చేస్తున్నారు. కోవిడ్ వార్డ్ లోకీ వెళ్ళగానే పిపిఈ కిట్లు ధరిస్తారు. అవి ఒకసారి ధరిస్తే మంచినీళ్లు కూడా తాగలేరు. కనీసం వాష్ రూమ్కు కూడా వెళ్ళలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వైరస్ సోకుతూనే వుంది. కోవిడ్ వార్డ్లలో పనిచేసిన తరువాత వారు కూడా క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నవి. ఈ మధ్య ఒక నర్సు తన కన్న కూతురిని చూడక చాలా రోజులైందరి, ఆమెను ఒక హోటల్లో క్వారంటైన్లో ఉంచి కుటుంబీకులు ఆమె కూతురుని తీసుకు వచ్చి హోటల్ ఎదురుగ నిలబడి తన తల్లిని చూపించారు. తల్లిని దూరం నుండి చుసిన కూతురు హృదయవిదారకంగా ఏడుస్తుంటే మాతృ హృదయం తల్లడిల్లింది. ఆమె కరోనా రోగులకు వైద్యం చేసే నర్సు. కూతుర్ని ముట్టుకోలేదు. ఇలాంటి సంఘటలను ఎంతో మంది నర్సులు అనునిత్యం ఎదుర్కొంటున్నారు. కుటుంబాలను తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. ప్రతి రోజు కరోనా వైరస్ సోకుతుందేమోననే భయం అనునిత్యం వారిని వెంటాడుతూనే వుంటుందీ. బొంబాయిలోని ఒక హాస్పిటల్లో 26 మంది నర్సులకు కరోనా వైరస్ సోకింది.
ఇప్పటికీ కొన్ని కాలనీలలో వారిని అనుమానంగా చూస్తూ, అపార్ట్మెంట్లలోకి, కాలనీలలోకి రానివ్వడం లేదు. హాస్పిటల్కు వెళ్ళినప్పుడు వారి సేవలు కావాలి కానీ పక్కింట్లో మాత్రం వద్దు అని అంటున్నారు. కొన్ని సార్లు మాత్రం కొన్ని ప్రదేశాల్లో పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారు. మన సైన్యం కూడా కరోనా వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిపై హెలికాఫ్టర్ల ద్వారా హాస్పిటల్స్ ప్రాంతాలలో పూలు జల్లి వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సోకితే కుటుంబ సభ్యులే దగ్గరికి వేళ్ళ లేని పరిస్థితుల్లో నర్సులే వారికి సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు పూలు జల్లడమే కాదు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలగాలి. వారి ఋణం ఏమిచ్చినా తీర్చుకోలేం. వారి ఆరోగ్యం, వారి భద్రతా మనకు చాల ముఖ్యం. వారికి సహకరించి మద్దతు గా నిలబడటం మన కనీస ధర్మం. వీరి సేవలకు గుర్తింపు తీసుకురావడం కొరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నర్సులు మరియు ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలి’ అనే నినాదం ఈ సంవత్సరం తీసుకున్నది. ఈ నినాదం ఈ సమయంలో అక్షర సత్యం అని చెప్పవచ్చు. 130 కోట్ల జనాభాకు సరిపోయే విధంగా ఆరోగ్య రంగానికి నిధులు ఇచ్చి నర్సులకు ఇతర వైద్య సిబ్బందికి, వారి పని స్థాయిలో వేతనాలు కల్పించి మరియు కనీస సౌకర్యాలు కల్పించాలి. వీరికి ప్రజల ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన ఉంటుంని చెప్పవచ్చు. కానీ కొన్ని సార్లు ప్రభుత్వాలు విరిని సమాచారం ఇచ్చే వ్యక్తులుగా మాత్రమే చూస్తున్నాయి. పని ప్రదేశాల్లో వేధింపులు, ఎక్కువ పని గంటలు, రోగి బంధువుల దాడులు, రాత్రి వేళల్లో విధులు వంటివి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నవి. పని ప్రదేశాల్లోని కెమికల్స్ వలన కూడా వీరు అనారోగ్యానికి కూడా గురి అవుతున్నారు. వీరికి కనీస వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వీరికి కావల్సిన మాస్కులు, గ్లౌసులు, శానిటైసర్లు, రక్షణ దుస్తులు వంటి కనీస సదుపాయాలు కల్పించాలి. ఖాళీగా వున్న పోస్టులను నింపితే వారిపై పని భారం తగ్గే అవకాశం ఉంది. వీరు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలను, బాధలను ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లలో శ్రమ దోపిడీ ఎక్కువగా వుంటున్నది. ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ అపత్కాల సమయంలో సేవలందిస్తున్న వీరికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తూ వీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ వారిలో ఆత్మస్టైర్యాన్ని నింపుతున్నదని చెప్పవచ్చు. వైద్య రంగానికి, మన దేశానికి నైటింగేల్ చేసిన సేవలకు గుర్తుగా మన ప్రభుత్వాలు ఉత్తమ సేవలు అందించిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్లను అందిస్తున్నవి. ప్రజల ఆరోగ్యం కొరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవా దృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత. నర్సులు మానవతకు మారు రూపాలు..వారిని గౌరవిద్దాం. వాళ్లకు రుణపడి ఉందాం. ఎల్లవేళలా. ఆస్పత్రులలోని అమ్మలూ మీకు వందనం.
