- తాజాగా ఉత్తర్వులను జారీచేసిన ఇంటర్ బోర్డు
- గతంలో కొరోనా కారణంగా 70 శాతం అమలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : ఇంటర్మీడియట్ సిలబస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి.. లాక్ డౌన్ పరిణామాల కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ తోనే బోధన.. పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తగినన్ని రోజులు క్లాసులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వం 70 శాతం సిలబస్ తోనే విద్యాబోధన.. పరీక్షలు జరిపించింది.
అయితే ఈ విద్యాసంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా ప్రారంభమై.. తరగతులు కరోనాకు ముందు స్థాయిలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్ 15 నుండి కాలేజీలు ప్రారంభం అయ్యాయని.. త్వరలోనే విద్యార్థులకు 100 శాతం సిలబస్ బోధన పూర్తవువుతుందని ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో సిలబస్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు, నిపుణనులతో సవి•క్షించిన ప్రభుత్వం వారి సూచనల మేరకు 100శాతం సిలబస్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఇంటర్ వార్షిక పరీక్షలను.. అలాగే సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తో పూర్తి స్థాయిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.