– అభినందించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: కామారెడ్డి వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈమేరకు ప్రజాభవన్లో తనను కలిసిన ఫౌండేషన్ ఇన్చార్జిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అభినందించారు. ఆపద సమయంలో సహాయం అందిస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రతినిధులు వంశీ, వినోద్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఇస్కాన్ ప్రాజెక్టుకు రహదారి సౌకర్యం కల్పించండి
కాగా, సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో 18 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ప్రాజెక్టుకు రహదారి సౌకర్యం కల్పించాలని మంత్రి సీతక్కకు ఇస్కాన్ బృందం విజ్ఞప్తి చేసింది. నేరెళ్లలో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ, సోలార్ విద్యుత్, సాలిడ్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్తోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇస్కాన్ చేపట్టనున్నది. ఆ ప్రాజెక్టుకు రహదారి సౌకర్యం కల్పించాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేయగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఇస్కాన్ ప్రాజెక్టుకు రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



